-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతులమీదుగా విద్యాకానుక కిట్ల అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విద్యాంధ్రప్రదేశ్ గా మార్చడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. దుర్గాపురంలోని S.T.V.R.M.C. ప్రభుత్వ పాఠశాలలో 496 మంది విద్యార్థులకు సోమవారం ఆయన జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా “థ్యాంక్యూ జగన్ మామ” అంటూ చిన్నారులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. జగనన్న విద్యాకానుక పథకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పండుగ వాతావరణం తీసుకొచ్చిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్షర క్రమంలోనే కాకుండా విద్యలోనూ మేటిగా ఉండాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆకాంక్షను నిజం చేస్తూ పదవ తరగతిలో ఈ ప్రాంత ప్రజలు మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. జగనన్న ఆణిముత్యాలలో అధిక భాగం సెంట్రల్ నియోజకవర్గంలోనే ఉన్నారనటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పుకొచ్చారు. అటువంటి విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకుని మిగతా విద్యార్థులు చదువులో పోటీతత్వం అలవాటు చేసుకోవాలని సూచించారు. అలాగే విద్యార్థులను భావి ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలను కల్పిస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఇతర రాష్ట్రాల కంటే 3 రెట్లు అధికంగా రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం ఖర్చు చేస్తోందని.. నాలుగేళ్లలో అక్షరాలా రూ.60,329 కోట్లు ఖర్చు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం.సూర్యప్రభ, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News