గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
బిఆర్ స్టేడియం అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి శాప్, జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో నిర్దేశిత యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశించారు. గురువారం బిఆర్ స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత స్టేడియంలో జరుగుతున్న క్రికెట్ గ్రౌండ్, వాకింగ్ ట్రాక్, గ్యాలరి మరమత్తులు, డ్రైన్ల నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై శాప్ ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకొని, మాట్లాడుతూ సుధీర్ఘ కాలం తర్వాత నగరంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియం అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, పనులు పూర్తి అయితే తూర్పు నియోజకవర్గంలోని ప్రజలకు అత్యత్తమ వసతులతో కూడిన స్టేడియం అందుబాటులోకి వచ్చినట్లే అని అన్నారు. మార్చి 15 నాటికి గ్రౌండ్ పనులు, 25 నాటికి గ్యాలరి పనులు పూర్తి అయ్యేలా కార్యాచరణ మేరకు పనులు చేయాలన్నారు. శాప్ ఇంజినీరింగ్ అధికారులు స్టేడియంలో నీరు బయటకు వెళ్లేందుకు డ్రైన్లు నిర్మాణం చేసే ముందే జిఎంసి ఇంజినీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని, లేకుంటే లెవల్స్ సరిగా లేక నీరు నిలిచే అవకాశం ఉందన్నారు. స్టేడియంలో డ్రైన్ల నిర్మాణం పూర్తి అయిన వెంటనే లెవల్స్ మేరకు స్టేడియం వెలుపల డ్రైన్, కల్వర్ట్ నిర్మాణ పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిఎంసి ఈ.ఈ.ని ఆదేశించారు. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో వాకర్స్ వస్తుంటారని, తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. స్టేడియంలో జరుగుతున్న పనులకు జిఎంసి నుండి అవసరమైన సహకారం ఉంటుందని, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పక్కాగా పాటించకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పర్యటనలో శాప్ ఈఈ సిద్దయ్య, జిఎంసి ఈఈ కోటేశ్వరరావు, డిఎస్డిఓ వెంకటేశ్వరరావు, స్థానికులు నూరి ఫాతిమా, డిఈఈ శ్రీధర్, ఏఈ సునీల్ కుమార్, రాంబాబు, స్థానిక కార్పొరేటర్ మీరావలి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News