-రాజమండ్రి కేంద్ర కారాగార సామాజిక పరివర్తనా కార్యక్రమంలో వక్తలు సూచన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జీవితం పట్ల అవగాహన లోపంతోనే నేరతో పౌరులు జైళ్ల పాలవుతున్నారని ప్రముఖ సామాజిక విశ్లేషకులు మలసాని శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి కేంద్ర కారాగారంలో సూపరింటెండెంట్, ఎస్. రాహుల్ నేతృత్వంలో గురువారం వివిధ నేరాల్లో శిక్షా ఖైదీలకు సామాజిక పరివర్తన కేంద్రం ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం జరిగింది. జైలు డిప్యూటీ సూపరెంటిండెంట్ ఎం రాజ్ కుమార్ అధ్యక్షతన మలసాని ఖైదీలకు మానసిక శిక్షణా కార్యక్రమాన్ని ఇచ్చారు. ఆదిలో జైలు అంటే కఠినమైన శిక్షలకు కేంద్రాలుగా ఉండేవని, మానవ విలువలు పెరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా జైళ్లు పరివర్తనా కేంద్రాలుగా మారాయి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వెలువడిన ఎన్నో అద్భుత గ్రంథాలు చాలామంది జైల్లో ఉండి రాసినవే అని ఆయన అన్నారు. ఖైదీలు జైల్లో చదువుకుంటూ, గ్రంథాలయాలను వినియోగించుకుంటూ, జైల్లో ఇచ్చే పలు రకాల శిక్షణలను సద్వినియోగం చేసుకుంటూ విడుదల అయిన తర్వాత మంచి పౌరులుగా, సమాజ మార్గదర్శకులుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకు ముందు పలువురు మానసిక ఖైదీలకు వ్యక్తిగత కౌన్సిలింగ్ ఇచ్చారు.
జైలు డిప్యూటీ సూపరెంటిండెంట్ ఎం రాజ్ కుమార్ మాట్లాడుతూ జైలులో ఖైదీల కోసం నిర్వహిస్తున్న పలు రకాల శిక్షణలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన పలువురు ఖైదీలు విడుదలైన తర్వాత తాము వ్యసనాల నుంచి దూరంగా ఉంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ నేరాలకు పాల్పడమని, అందరితోనూ ఆత్మీయంగా మెలుగుతామని, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తామని అయన ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా పలువురు ఖైదీలు మాట్లాడుతూ వారం వారం నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమం తమకు ఎంతో ప్రయోజనకరంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో జైలు వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్ శ్రీనివాసరావు, జైలు ఉపాధ్యాయులు చిలుకూరి శ్రీనివాసరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News