-కేంద్ర మంత్రి శ్రీపాద యశో నాయక్ వెల్లడి
-ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అడిగిన ప్రశ్నకు సమాధానం
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్లో భూగర్భఉష్ణ శక్తి (Geothermal Energy) ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు ఎలాంటి ప్రతిపాదనలు లేవని కేంద్ర విద్యుత్, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్ వెల్లడించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు బుధవారం ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
భూఉష్ణ శక్తిపై పరిశోధనలు, దేశవ్యాప్త అధ్యయనం
భారత ప్రభుత్వం “పునరుత్పాదక శక్తి పరిశోధన, సాంకేతిక అభివృద్ధి కార్యక్రమం (RE-RTD)” ద్వారా భూఉష్ణ శక్తి అభివృద్ధిని ప్రోత్సహిస్తోంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) 381భూఉష్ణ శక్తి ప్రాంతాలపై అధ్యయనం చేసి “జియోథర్మల్ అట్లాస్ ఆఫ్ ఇండియా – 2022” నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా 10,600 మెగావాట్ల భూగర్భఉష్ణ శక్తి ఉత్పత్తి సామర్థ్యం ఉందని అంచనా వేయబడింది. అయితే, ఈ నివేదికలో ఆంధ్రప్రదేశ్లోని ప్రత్యేక ప్రాంతాల వివరాలు లేవు.
తెలంగాణలో పైలట్ ప్రాజెక్ట్ – ఏపీలో ఎటువంటి ప్రతిపాదన రాలేదు
తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు వద్ద సింగరేణి కొల్లియరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) 20 కిలోవాట్ల భూగర్భ ఉష్ణ శక్తి ప్లాంట్ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. అయితే, ఆంధ్రప్రదేశ్లో భూగర్భ ఉష్ణ శక్తి ప్లాంట్కు ఎటువంటి ప్రతిపాదనలు లేవని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీలో భూగర్భఉష్ణ శక్తి ప్రాజెక్టుల కోసం ఎటువంటి నిధులు కేటాయించలేదని తెలిపారు.
Prajavartha Online Telugu News