– విస్తృత ప్రజాప్రయోజన మౌలిక వసతుల పనులపై ప్రత్యేక దృష్టి
– పక్కా ప్రణాళికతో రహదారుల అభివృద్ధి పనులు
– పనుల సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో రహదారులు
– సమన్వయ శాఖల భాగస్వామ్యంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు
– ఆటోనగర్ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు పగడ్బందీ ఏర్పాట్లు
– ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రోజురోజుకు పెరుగుతున్న విజయవాడ నగర అవసరాలకు తగ్గట్లు దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులపై దృష్టిపెట్టిందని.. ఈ నేపథ్యంలో సమష్టి కృషితో పక్కా ప్రణాళికతో రహదారులతో పాటు మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. సోమవారం ఉదయం ఎంపీ శివనాథ్.. కలెక్టర్, శాసనసభ్యులతో కలిసి నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. మహానాడు బల్లెంవారి వీధి ప్రాంతంతో పాటు ఆటోనగర్ ప్రాంతంలో పర్యటించి.. రహదారులతో పాటు లింక్ రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల నేపథ్యంలో ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రజలు సజావుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా ఇప్పటినుంచే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. మహానాడు రోడ్డు నుంచి నిడమానూరువరకు ఫ్లైఓవర్తో పాటు తొలిదశలో గన్నవరం నుంచి మెట్రో కారిడార్ పనులు పూర్తయితే విజయవాడ మరింత శరవేగంగా అభివృద్ధి పథంలో పయనించేందుకు వీలవుతుందని.. ఈ పనులు పూర్తయ్యేలోపు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారిస్తున్నట్లు వివరించారు. ఆటోన్గర్ ప్రాంతంలోకి రాకపోకలు సాగించే లారీల వల్ల ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో భాగంగా మురళీ నగర్ నుంచి బల్లెంవారి వీధి వరకు ప్రాంతాలను పరిశీలించినట్లు తెలిపారు. అదేవిధంగా గన్నవరం విమానాశ్రయానికి రామవరప్పాడు రింగ్ రోడ్డు నుంచి ప్రత్యామ్నాయ మార్గంపైనా, రహదారుల పనులపై దృష్టిసారించినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ను గుంతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే గొప్ప లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపినట్లు ఎంపీ వివరించారు. రహదారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు: కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ రహదారులతో పాటు మౌలిక వసతుల మరింత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలుచేయనున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు, భవిష్యత్తులో చేపట్టనున్న పనులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ మార్గాలు, రహదారుల పనులపై దృష్టిసారిస్తున్నట్లు వివరించారు. రాజధాని అమరావతికి రాకపోకలకు విజయవాడ రోడ్లు ప్రధానమైనవన్నారు. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు కృషి: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజయవాడ నగర అభివృద్ధికి పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ శాయశక్తులా కృషిచేస్తున్నారని.. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగంతో కలిసి నగరంలో ట్రాఫిక్ సమస్య అనేది లేకుండా కృషిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంతోనేన సాధ్యమని ఎమ్మెల్యే రామ్మోహన్ స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News