విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర క్రికెట్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)ను విశాఖకు చెందిన టీమ్ ఇండియా క్రికెటర్ కె.నితీష్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గురునానక్ కాలనీలోని కేశినేని శివనాథ్ నివాసంలో ఆయన్ను నితీష్ కుమార్ రెడ్డి గురువారం కలవటం జరిగింది. ఏసీఏ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తో పాటు ఏసీఏ కార్యదర్శి రాజ్యసభ ఎంపి, సానా సతీష్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి కి సాదర స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం ఎంపిలు ఇద్దరు నితీష్ కుమార్ రెడ్డిని శాలువాతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించారు. ఈ సందర్బంగా నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ విశేషాలను పంచుకున్నారు. నితీష్ కుమార్ రెడ్డి ప్రతిభను చిన్నతనంలోనే గుర్తించి క్రికెట్ లో ప్రోత్సహించినందుకు నితీష్ కుమార్ రెడ్డి తండ్రి కె. ముత్యాల రెడ్డిని ఎంపిలు ఇద్దరు ప్రశంసించారు.
తన తొలి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ సాధించి రికార్డ్ క్రియేట్ చేసిన నితీష్ కుమార్ రెడ్డి కి ఎంపి కేశినేని శివనాథ్ అభినందనలు తెలిపారు. ఎపిలోనే కాకుండా దేశవ్యాప్తంగా క్రికెట్ లో రాణించాలనుకునే ఎంతో మంది క్రీడాకారులకు నితీష్ కుమార్ రెడ్డి స్పూర్తిగా నిలిచాడని కొనియాడారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తన ఆటతీరును కొనియాడిన ఏసీఏ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్ కు నితీష్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏసీఏ తరుపున మరింత మంది క్రికెటర్స్ ఇండియన్ క్రికెట్ టీమ్ , ఐపీఎల్ లో ఆడేందుకు ఏసీఏ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్ ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. యంగ్ క్రికెటర్స్ కి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏసీఏ ఉపాధ్యక్షుడు పి.వెంకట రామ ప్రశాంత్, కోశాధికారి దండమూడి శ్రీనివాస్, ఏసీఏ కౌన్సిలర్ దంతు గౌరు విష్ణుతేజ్, కె.ముత్యాలరెడ్డి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News