అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతాంగాన్ని పూర్తిగా నిరాశపర్చిందని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘ రాష్ట్ర అధ్యక్షులు జి. ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్లు అన్నారు.
గత నాలుగు సంవత్సరాలుగా రైతాంగం దేశవ్యాప్తంగా చట్టబద్ద యం.యస్.పి. కావాలని ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం మోడీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేకతను మరోసారి చాటి చెప్పింది. 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ స్వామినాధన్ కమీషన్ సిఫార్సులు అమలు చేస్తామని రైతాంగానికి మద్దతు ధరలు కల్పిస్తామని హామి యిచ్చారన్నారు. కానీ రైతాంగం ఆందోళన చేస్తున్నా స్వామినాధన్ కమీషన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరలు ఇవ్వలేదు. ఈ బడ్జెట్లో సైతం మరో మారు రైతాంగానికి మొండి చెయ్యి చూపించారు. అదేవిధంగా రైతాంగం తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయిన నేపధ్యంలో ఒక్క పర్యాయం రైతాంగానికి ఉన్న అప్పులన్నింటినీ రుణ మాఫీ చేయాలని రైతుసంఘాలు కోరుతున్నా ఈ బడ్జెట్లో సైతం తగిన కార్యాచరణ లేకపోవడం దురదృష్టకరం.
మరో ప్రక్క 16 లక్షల కోట్ల రూపాయలు కార్పోరేట్లకు మాఫీ చేసింది ఈ ప్రభుత్వం. రైతాంగం ఎదురు చూస్తున్న విత్తనబిల్లు, ఎరువుల ధరల క్రమబద్దీకరణ అంశాలు బడ్జెట్లో కానరావడంలేదన్నారు. కార్పోరేట్ విత్తన, ఎరువుల సంస్థలకు ప్రోత్సాహాకాలు ఈ ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉన్నది. బడ్జెట్ చర్చ అనంతరం వివిధ విత్తన మరియు ఎరువుల కంపెనీల షేర్ల ధరలు 15 నుండి 20శాతానికి పెరిగాయంటే మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎవరిని ఉద్దరించడానికో అర్థమవుతున్నది. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని 3 లక్షల నుండి 5 లక్షలకు పెంచారు. అదే విధంగా గతంలోనే రిజర్వుబ్యాంకు ఎటువంటి షూరిటీ లేకుండా పేద ప్రజలకు ఎటువంటి హామీలేకుండా ఇచ్చే రుణ పరపతిని 1.60 లక్షల నుండి 2 లక్షలకు పెంచింది. అయితే ఈ ప్రయోజనాన్ని పేద రైతులు, చిరు వ్యాపారులకు, కౌలు రైతులకు అందడంలేదు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతాంగాన్ని, పేద ప్రజానీకాన్ని మభ్యపెట్టేదిగా ఉందనేది వాస్తవం. తక్షణం బడ్జెట్పై పున:పరిశీలన చేసి నూటికి 60శాతం మంది ఆధారపడిన వ్యవసాయరంగానికి, రైతాంగానికి మేలు చేకూర్చేలా బడ్జెట్లో మార్పులు చేయాలని జి. ఈశ్వరయ్య, కె.వి.వి.ప్రసాద్లు డిమాండ్ చేశారు.
Tags amaravathi
Check Also
ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ
-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …
Prajavartha Online Telugu News