– ఈ బడ్జెట్ పీపుల్స్ బడ్జెట్గా నిలిచిపోతుంది
– ఏపీని దేశంలోనే అగ్రపథాన నిలబెట్టే బడ్జెట్
– పోలవరం పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరిస్తాం
– కేంద్ర సహకారంతో ఏపీని దేశంలోనే అగ్రపథాన నిలుపుతామన్న మంత్రి కొల్లు రవీంద్ర
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విజన్ 2047, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు భరోసాగా నిలుస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. ఇది పీపుల్స్ బడ్జెట్. సామాన్యులను ఆర్ధికంగా ఎదిగేలా చేసే బడ్జెట్. ముఖ్యంగా రూ.12 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు నిర్ణయం ఉద్యోగులకు వరం. వ్యవసాయ రంగం, గ్రీన్ ఎనర్జీ విషయంలో బడ్జెట్ కేటాయింపులు ఆయా రంగాలకు తోడ్పాటుగా నిలుస్తాయి. దేశాన్ని ప్రపంచానికి మార్గదర్శిగా చూపించే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. ఏపీకి తలమానికంగా నిలిచే పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్కు చేసిన బడ్జెట్ కేటాయింపుల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో ఈ బడ్జెట్ ఎంతో కీలకంగా నిలుస్తుంది. పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన నిధులతో పోలవరం ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరందించాలనే చంద్రబాబు నాయుడు లక్ష్య సాధనకు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని మనస్పూర్తిగా స్వాగతిస్తున్నాం. బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి అధిక ప్రాధాన్యం కల్పించినందుకు ప్రధాని మోదీ కి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి ప్రత్యేక ధన్యవాదాలు అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
Prajavartha Online Telugu News