-శారీరక, మానసిక ఆరోగ్యం సూర్య నమస్కారాలతోనే సాధ్యం
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక భావన సూర్య నమస్కారాలతోనే సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. వసంత పంచమి,రథ సప్తమి పర్వ దినాలను పురస్కరించుకుని ఆంధ్ర ప్రదేశ్ యోగసభ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం వేకువజామున స్థానిక జిల్లా పరిషత్ కల్యాణ మండపంలో 100 మంది యోగ సాధకులతో 108 పర్యాయాలు సూర్య నమస్కారాల ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం నేపథ్యంలో జరిగిన సూర్య నమస్కారాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలను నేడు సూర్య నమస్కారాలతో ప్రారంభిస్తారన్నారు. బ్రహ్మ ముహూర్తంలో ఆచరించే సూర్య నమస్కారాలవల్ల సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని అన్నారు. సూర్య నమస్కారం యొక్క నిరంతర అభ్యాసంతో మెరుగైన మానసిక స్పష్టత, ఏకాగ్రతకు దారితీస్తుందన్నారు. సూర్య నమస్కారాలు కేవలం భౌతిక సాధన కాదని, మనస్సు-శరీర అవగాహనను కూడా పెంపొందించుకోడానికి దోహద పడతాయన్నారు. శారీరక, మానసిక భావోద్వేగ శ్రేయస్సుకు యోగా అనేది అత్యంత విశిష్టమైన వ్యాయామం అని అన్నారు. యోగాలో పలు ఆసనాలు, ప్రాణయామం లాంటి శ్వాసక్రియ అభ్యాసాలు, వివిధ భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలు అలాగే ధ్యాన ముద్రలు భాగంగా ఉంటాయన్నారు. యోగాసనాలు, ప్రాణాయామం, మంత్రము, ధ్యానం ఇలా అన్నింటిని మిళితం చేసే సంపూర్ణ సాధనే సూర్య నమస్కారం అని అన్నారు. యోగా గురువులు సూర్యోదయం సమయాన సూర్యునికి అభిముఖంగా నిలబడి సూర్య నమస్కారాలు చేస్తారని కలెక్టర్ అన్నారు.
కార్యక్రమంలో 100 మంది 108 సార్లు సూర్య నమస్కారాలు,12 రకాల ఆసనాలు చేశారు. టీటీడీ ధర్మచారిని జొన్నలగడ్డ మాధవి భగవద్గీత పారాయణం చేశారు. ఈ మెగా ఈవెంట్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం చోటుచేసుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న వారికి జిల్లా కలెక్టర్ సర్టిఫికెట్లు అందజేశారు. యోగా గురువులు ఘంటసాల గురునాథ బాబు, మద్దాల చింతయ్య, మహాలక్ష్మి, ముదిగొండ శాస్త్రి , ఆర్.డి ప్రసాద్ తో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News