గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టే రోడ్లు డ్రైన్ టు డ్రైన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ ఏటి అగ్రహారం, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఇస్కాన్ గుడి రోడ్, పట్టాభిపురం, గోరంట్ల, ఇజ్రాయిల్ పేట, సుద్దపల్లి డొంక తదితర ప్రాంతాల్లో అభివృద్ధి, పారిశుధ్య పనులను, తనిఖీ చేసి తీసుకోవాల్సిన చర్యలపై ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పలు ప్రాంతాల్లో చేపట్టిన సిసి రోడ్లను పరిశీలించి, డ్రైన్ టు డ్రైన్ ఏర్పాటు చేయకపోవడం గమనించి, ఇక నుండి నూతన రోడ్లను డ్రైన్ టు డ్రైన్ ఏర్పాటు చేయాలన్నారు. సిసి రోడ్లు, డ్రైన్ల నిర్మాణ సమయంలో క్యూరింగ్ ని నిర్దేశిత సమయం చేసేలా ఎమినిటి కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సుద్దపల్లి డొంక రోడ్ ని పరిశీలించి, పెండింగ్ రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఈఈని ఆదేశించారు. ఇస్కాన్ గుడి రోడ్ లో వ్యర్ధాలు రోడ్ల పక్కన ఉండడం గమనించి, రోడ్ల పక్కన వేసే వారికి నోటీసులు ఇవ్వాలని, గోరంట్లలో ఇంటింటి చెత్త సేకరణ తీరుని ప్రత్యక్షంగా పరిశీలించి, తడిపొడిగా వ్యర్ధాలు ఇచ్చేలా ప్రజలకు అవగాహన కల్గించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ల ని ఆదేశించారు. ఇజ్రాయిల్ పేట వద్ద హోర్డింగ్స్ ని పరిశీలించి, ఆయా హోర్డింగ్స్ అనుమతి, ఫీజుల చెల్లింపుపై సమగ్ర వివరాలు అందించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. పర్యటనలో డిఈఈ మధుసూదన్, ఏసిపి చంద్రశేఖర్, టిపిఎస్ లు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News