గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పరిధిలో అభివృద్ధి పనులను స్థానిక ప్రజల అవసరాల రీత్యా ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని, చేపట్టిన పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ తమ రోజువారీ పర్యటనలో భాగంగా ఆదర్శ నగర్, ఏటి అగ్రహారం, పెద్ద పలకలూరు, స్వర్ణాంధ్ర నగర్, తారకరామ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులైన రోడ్లు, డ్రైన్లు స్థానిక ప్రజల అవసరాల రీత్యా, ప్రాధాన్యత క్రమంలో చేపట్టడానికి ఇంజీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చేపట్టిన పనుల్లో జాప్యం జరిగితే ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా ఉంటుందని, పనులను నిర్దేశిత గడువు మేరకు పూర్తి చేయడానికి ఇంజినీరింగ్ అధికారులు భాధ్యత తీసుకోవాలన్నారు. ఇప్పటికే నగరంలో జరిగిన సిసి రోడ్లు, డ్రైన్ల నాణ్యతపై పలు ఫిర్యాదులు అందుతున్నాయని, బిల్లుల చెల్లింపు చేయడానికి ముందుగా ప్రతి పనిని పూర్తి స్థాయి పరిశీలన చేస్తామని, అందులో నాణ్యతలోపాన్ని గుర్తిస్తే సంబందిత అధికారులు భాధ్యత వహించాలని స్పష్టం చేశారు. నూతన రోడ్ నిర్మాణ పనులు తప్పనిసరిగా డ్రైన్ నిర్మాణం చేసిన తర్వాతనే చేయాలని, రోడ్ డ్రైన్ టు డ్రైన్ జరిగేలా ప్రతిపాదనలు ఉండాలని ఆదేశించారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని వార్డ్ సచివాలయాల వారీగా త్రాగునీటి పైప్ లైన్ లీకులు, మరమత్తులు చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని, ప్రజల నుండి త్రాగునీటి సరఫరాపై ఫిర్యాదులు రాకుండా క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. తొలుత ఏటి అగ్రహారం మస్టర్ పాయింట్ ని తనిఖీ చేసి, కార్మికుల హాజరుని తనిఖీ చేసి, డివిజన్ పరిధిలో పారిశుధ్య పనులపై ఇన్స్పెక్టర్, కార్యదర్శులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
పర్యటనలో డిఈఈలు మధుసూదన్, రమేష్ బాబు, ఆర్ఓ రవికిరణ్ రెడ్డి, ఎస్ఎస్ లు ఆనంద కుమార్, సోమశేఖర్, టిపిఎస్ లు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News