-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిజాయితీ, నిరాడంబరత్వం, ఉన్నత విలువలకు మారుపేరైన దామోదరం సంజీవయ్య అందరికీ ఆదర్శప్రాయులని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దివంగత దామోదరం సంజీవయ్య 104 వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రప్రథమ దళిత ముఖ్యమంత్రి సంజీవయ్య జాతికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో కార్మికశాఖ, విద్యాశాఖలో పలు సంస్కరణలు చేసి రూపొందించిన చట్టాలు వివిధ వర్గాలకు ఎనలేని మేలు చేశాయని చెప్పారు. బోనస్ చట్టాన్ని ప్రవేశపెట్టడంతో బోనస్ సంజీవయ్యగా పేరు పొందారని పేర్కొన్నారు. చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన ఘనత దామోదరం సంజీవయ్యకే దక్కిందన్నారు. వితంతువులు, వృద్ధులకు పింఛన్ ఇచ్చే విధానాన్ని ఆయనే ప్రవేశపెట్టారన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టడానికి, ప్రజల ఇబ్బందులు తొలగించడానికి ఏ.సి.బి వ్యవస్థను దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏపీలో స్థాపించారన్నారు. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన సంజీవయ్య తన అసమాన ప్రతిభతో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారని కీర్తించారు. అయినప్పటికీ నీతికి, నిజాయితీకి, నిరాడంబర జీవితానికి మారుపేరుగా మారి ఆదర్శప్రాయులుగా నిలిచారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు దోనేపూడి శ్రీనివాసరావు, కొండా మహేశ్వర్ రెడ్డి, నందెపు సురేష్, బండారు అంజి, కోలంటి రవి, సామంతకూరి దుర్గారావు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News