– షష్ట షణ్ముఖ క్షేత్రాల పర్యటనలో భాగంగా తిరుపరంకుండ్రం క్షేత్రం సందర్శన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శివుడు, విష్ణువు అభిముఖంగా శ్రీవల్లి దేవసేన సమేతంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారు వెలిసిన తిరుపరంకుండ్రం దివ్య క్షేత్రాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. శ్రీ దుర్గా శక్తితో పాటు సోదరుడైన శ్రీ సత్య గణపతి స్వామి వారి చెంతనే ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యుడు వెలసి భక్తులను కటాక్షిస్తారు. దక్షిణ భారతదేశ దేవాలయాల పర్యటనలో భాగంగా షష్ట షణ్ముఖ క్షేత్రాల సందర్శనకు శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ శుక్రవారం సాయంత్రం మధురై సమీపంలోని తిరుపరంకుండ్రం శ్రీ మురుగన్ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పవన్ కళ్యాణ్ కి సంప్రదాయబద్దంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనానికి తీసుకువెళ్లారు. ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారి విశిష్టతను పవన్ కళ్యాణ్ కి వివరించారు. ఆరవ శతాబ్దంలో కొండను చెక్కుతూ.. అత్యంత సుందరంగా వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి మోకరిల్లి పవన్ కళ్యాణ్ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ఉన్న శివ, వైష్ణవ ఆలయాలను దర్శించుకుని పూజలు చేసి స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయం లోపలే ఉన్న వేద పాఠశాలను పవన్ కళ్యాణ్ సందర్శించారు. పవన్ కళ్యాణ్ కి గౌరవ మర్యాదలతో వేదపఠనం చేసి చిన్నారులంతా స్వాగతం పలికారు. అనంతరం సంప్రదాయ రీతిలో పవన్ కళ్యాణ్ ని వేద పండితులు ఆశీర్వదించి సత్కరించారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్, టిటిడి బోర్డు సభ్యుడు ఆనంద సాయి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News