-విద్యుత్ చార్జీలు చెల్లింపుల భారం తగ్గించాలన్నదే లక్ష్యం..
-పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి..
-డిఆర్ఓ కె చంద్రశేఖర రావు
మచిలీపట్నం., నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్ బిల్లుల చెల్లింపుల భారం తగ్గించేందుకు అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన కలిగి ఉండి సోలార్ ప్యానెల్ కనెక్షన్ల కొరకు లబ్ధిదారులను ప్రోత్సహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకం పై ముందుగా ఉద్యోగులకు అవగాహన కల్పించి లబ్ధిదారులను ప్రోత్సహించడంలో భాగంగా గురువారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో పశుసంవర్ధక, సహకార, దేవాదాయ, తదితర శాఖల ఉద్యోగులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిఆర్ఓ చంద్రశేఖర రావు మాట్లాడుతూ ప్రజలకు విద్యుత్ చెల్లింపుల బారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ బుక్ బిజిలి యోజన పథకాన్ని అమలు చేస్తుందన్నారు. అతి తక్కువ ఖర్చుతో లబ్దిదారులు ఇంటి పై సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా తయారైన విద్యుత్ను ఉచితంగా గృహ అవసరాలకు వినియోగించుకోవడం ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లింపులు చెల్లించవలసిన అవసరం ఉండదన్నారు. తద్వారా ఆర్థిక ప్రయోజనం పొందగలుగుతారన్నారు.
360 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన మూడు కిలోవాట్ల సోలార్ టాప్ కు రూ 78,400, 240 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన రెండు కిలోవాట్లకు 60 వేల రూపాయలు, 120 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఒక కిలోవాట్ కు 30 వేల రూపాయలు ప్రభుత్వ రాయితీ ఉందన్నారు. రాయితీ మినహా మిగిలిన సొమ్మును తక్కువ వడ్డీతో బ్యాంకు రుణంగా పొందొచ్చన్నారు. దాదాపు 20 ఏళ్లపాటు ఉచితంగా సౌర విద్యుత్ను పొందొచ్చని వివరించారు. 3 కేవీ వ్యవస్థ ద్వారా నెలకు 360 యూనిట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేయొచ్చని.. మన అవసరాలకు సరిపడా మిగిలిన సౌర విద్యుత్ను గ్రిడ్కు ఇవ్వడం ద్వారా ఆదాయం పొందవచ్చునని తెలిపారు.
బ్యాంకు నుండి రుణం పొందిన లబ్దిదారులు సూర్యఘర్ పథకం ద్వారా ఉచితంగా విద్యుత్ను వినియోగించుకుని ప్రతి నెల సాదరణ విద్యుత్ బిల్లు చెల్లించడం ద్వారా ఆదా అయ్యే సొమ్మును బ్యాంక్ రుణం కింద చెల్లిస్తే రుణం తీరుతుందన్నారు. ఇంటి కప్పుపై ప్రభుత్వ రాయితీతో పాటు అతి తక్కువ ఖర్చుతో సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకొని ఉచితంగా విద్యుత్ను వినియోగించుకుని కరెంట్ బిల్లుల భారాన్ని తగ్గించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సూర్యఘర్ పథకం కింద రుణం కొరకు ధరఖాస్తు చేసుకుంటే కాలయాపన చేయకుండా స్వీకరించిన ధరఖాస్తులను పరిశీలించి తక్షణమే రుణాలను మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించామన్నారు. స్వయం సహాయక సంఘ మహిళలు కూడా పెద్దఎత్తున రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారన్నారు. సౌర శక్తి విద్యుత్ను వినియోగించుకోవడం ద్వారా కాలుష్య రహితపర్యావరణ హిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని డిఆర్ ఓ కె.చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ పి సాయిబాబు, కలెక్టరేట్ ఏవో సిహెచ్. వి. ఆంజనేయ ప్రసాద్, ఉద్యోగులు ఉన్నారు.
Prajavartha Online Telugu News