– ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించిన ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్, బ్యాంకర్లు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్బీఐ-ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు (ఫిబ్రవరి 24-ఫిబ్రవరి 28) సందర్భంగా సోమవారం విజయవాడ నోవాటెల్లో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్.. బ్యాంకింగ్ అధికారులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. 2016 నుంచి ఆర్బీఐ ఏటా అక్షరాస్యత వారోత్సవాలను ప్రత్యేక ఇతివృత్తంతో నిర్వహిస్తోందని.. ఈ ఏడాది ఆర్థిక అక్షరాస్యత: మహిళల శ్రేయస్సు ఇతివృత్తంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ తెలిపారు. సమాజంలో మహిళల బహుముఖ పాత్రను పరిగణనలోకి తీసుకుని వారికి ఆర్థిక అక్షరాస్యతకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ ఇతివృత్తం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజలు ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని బాధ్యతాయుత ఆర్థిక ప్రవర్తనతో ఉన్నతంగా ఎదగాలన్నారు. బ్యాంకులు ద్వారా అందుతున్న పథకాలు, సేవలను సరైన విధంగా అర్థం చేసుకొని ఉపయోగించుకోవాలని వివిధ బ్యాంకుల అధికారులు సూచించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకు లింకేజీతో అమలు చేస్తున్న కార్యక్రమాలపై అవగాహన పెంపొందించుకొని వాటి ఫలాలను అందిపుచ్చుకోవాలన్నారు. చిన్న వయసు నుంచే ఆర్థిక క్రమశిక్షణ పెంపొందించుకోవాలని సేవింగ్స్, బడ్జెటింగ్, సైబర్ భద్రత తదితరాలపై దృష్టిసారించాలని సూచించారు. ఆర్బీఐ ఆర్థిక అక్షరాస్యతా కేంద్రాల సేవలను కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్, సిడ్బీ, ఎస్ఎల్బీసీ, వివిధ బ్యాంకుల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News