గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని రోడ్లపై నాటు కోళ్లు, చేపల, మాంస అనధికార విక్రయాలు చేయడానికి వీలులేదని, డివిజన్ల వారీగా అనధికార విక్రయాలు జరగకుండా ప్రజారోగ్య అధికారులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శనివారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ, నగర పరిధిలోని ప్రధాన, అంతర్గత రోడ్లపై అనధికారిక నాటుకోళ్లు, చేపలు, మాంస విక్రయాలు జరగకుండా ప్రజారోగ్య అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అనధికార విక్రయాలు చేసే వారికి భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించటమే కాకుండా చట్టప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. మాంస విక్రయదారులు తప్పనిసరిగా నగరపాలక సంస్థ నుండి డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ పొంది వ్యాపారం నిర్వహించుకోవాలని, లైసెన్స్ లేని షాపులను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. అనధికార మాంస విక్రయాలను అరికట్టుటకు శానిటరీ ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులు బృందాలుగా ఏర్పడి ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అలాగే మాంస విక్రయ షాపుల యజమానులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మాంసంపై దుమ్ము, ధూళి పడకుండా మెస్ లను కట్టి ఎప్పటికప్పుడు శుభ్రత పాటించాలన్నారు.
Prajavartha Online Telugu News