– ఈ నెల 8వ తేదీ నుంచి 18 వరకు సచివాలయ సిబ్బంది ద్వారా కార్యక్రమం
– రెండు రోజుల పాటు మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు
– సమష్టి భాగస్వామ్యంతో సర్వేను విజయవంతం చేయాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదరికం లేని సమాజ నిర్మాణం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్షిప్ (పీ4) సర్వేకు రూపకల్పన చేయడం జరిగిందని.. ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
బుధవారం కలెక్టర్ లక్ష్మీశ.. ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లతో వర్చువల్గా పీ4 సర్వేపై సమావేశం నిర్వహించారు. ఈ నెల 6, 7 తేదీల్లో రెండురోజుల పాటు మాస్టర్ ట్రైనర్లుగా ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు తమ పరిధిలోని గ్రామ లేదా వార్డు సచివాలయ సిబ్బందికి సర్వేపై పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. టెక్ మాడ్యూల్తో పాటు సర్వే విధానాన్ని క్షుణ్నంగా వివరించాలన్నారు. పేదరికాన్ని దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాయుతంగా చేపడుతున్న కార్యక్రమాలకు అదనంగా సామాజికంగా, ఆర్థికంగా పైన ఉన్న కుటుంబాలు సామాజిక బాధ్యతగా అట్టడుగున ఉన్న కుటుంబాలకు మద్దతుగా నిలిచేలా ప్రోత్సహించడం పీ4 విధానం లక్ష్యమని వివరించారు. పేదల అవసరాలను గుర్తించి.. వారి సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టుల రూపకల్పనకు ఈ సర్వే దోహదం చేస్తుందని.. కుటుంబాలు ప్రస్తుతం అందుకుంటున్న పథకాలపై ఈ సర్వే ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు. సర్వే ద్వారా సేకరించిన డేటా ఆధారంగా ఇంటి అవసరాలకు అనుగుణంగా సమర్థవంతమైన ప్రణాళికల రూపకల్పనకు వీలవుతుందన్నారు. ఈ సమాచారాన్ని కుటుంబాలకు వివరించి.. కుటుంబ వివరాలతో పాటు వివిధ సామాజిక, ఆర్థిక పరామితుల కచ్చితమైన సమాచారాన్ని యాప్లో పొందుపరచాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కుటుంబాలకు ఏవైనా అపోహలు ఉంటే తొలగించి, సర్వేను పది రోజుల్లో పూర్తిచేయాల్సి ఉంటుందన్నారు. అన్ని సమన్వయ శాఖల సమష్టి భాగస్వామ్యంతో సర్వేను విజయవంతంగా పూర్తిచేసేందుకు క్షేత్రస్థాయి అధికారులు కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
సమావేశంలో సీపీవో వై.శ్రీలత, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News