విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ గవర్నర్పేట సీవీఆర్ మునిసిపల్ కార్పొరేషన్ ఉన్నతపాఠశాల పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా పదో తరగతి పరీక్షల నిర్వహణకు, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. వేసవి నేపథ్యంలో తాగునీటికి, విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా తీసుకున్న చర్యలతో పాటు వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రం గదుల్లో ఏర్పాటుచేసిన ఏర్పాట్లను కూడా పరిశీలించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు తదితరుల వివరాలను అడిగి తెలుసుకొని.. చీఫ్ సూపరింటెండెంట్తో సహా ఇన్విజిలేటర్లు, పరీక్షా విధులకు కేటాయించిన ప్రతిఒక్కరినీ క్షుణ్నంగా తనిఖీచేసి మాత్రమే లోపలికి అనుమతించాలన్నారు. పరీక్ష రాసే విద్యార్థులకు గదుల్లో గాలి, వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలని.. ఏమాత్రం ఇబ్బంది తలెత్తకుండా చూడాలన్నారు. పాఠశాల విద్య, రెవెన్యూ, పోలీస్, ప్రజా రవాణా, వైద్య ఆరోగ్యం, విద్యుత్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. జిల్లాలో 168 పరీక్ష కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. భద్రతతో పాటు ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీచేసినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
Prajavartha Online Telugu News