-రూల్ నెంబర్ 377 కింద లెవనెత్తిన ఎమ్.ఎస్.ఎమ్.ఈ.లకు కొత్త రుణ అంచనా విధానం అంశం
-విజయవాడ ఆటోనగర్ లోని లక్షమంది కి పైగా కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ప్రస్తావన
-ఎమ్.ఎస్.ఎమ్.ఈ.లు రుణాలు పొందడంలో ప్రధాన అడ్డంకిగా మారిన సిబిల్ స్కోర్
-2024-25 బడ్జెట్లో ఎమ్.ఎస్.ఎమ్.ఈ ల కోసం డిజిటల్ డేటా ఆధారంగా కొత్త రుణ అంచనా విధానం అభివృద్ధికి ప్రభుత్వం సూచన
-కొత్త రుణ అంచనా విధానం అమలుకు తీసుకుంటున్న చర్యలు వెల్లడించాలని కోరిన ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ లో దేశంలోనే అతి పెద్దదైన ఆటోనగర్ 305 ఎకరాల్లో వుంది. ఈ ఆటోనగర్ లో లక్ష మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. ఆటో మొబైల్ ఇండస్ట్రీకి సంబంధించి ఆటోమొబైల్ తయారీ యూనిట్లు సూక్ష్మ, చిన్న మధ్య తరహా సంస్థలుగా (MSME) అనేకం వున్నాయి.ఈ ఆటో మొబైల్ ఇండస్ట్రీలోని పరిశ్రమలు స్థానిక ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకంగా నిలుస్తున్నారు. ఈ సూక్ష్మ,చిన్న,మధ్య తరహా పరిశ్రమల పారిశ్రామికవేత్తలు వారి వ్యాపారాల కోసం బ్యాంకుల నుంచి రుణాలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ ఇబ్బందులకు ప్రధాన కారణం సిబిల్ స్కోర్. సిబిల్ స్కోర్ ఆధారంగా రుణాలు మంజూరు చేయటం వల్ల సిబిల్ స్కోర్ తక్కువగా వున్న ఎమ్.ఎస్.ఎమ్.ఈలు రుణాలు పొందలేక చాలా ఇబ్బందులు పడుతున్న సమస్యను విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) మంగళవారం లోక్ సభలో ప్రస్తావించారు. రూల్ 377 కింద ఎమ్.ఎస్.ఎమ్.ఈ.లకు ఆదాయ ఆధారిత కొత్త రుణ అంచనా విధానం అమలు చేయాలనే అంశం లేవనెత్తారు.
సిబిల్ స్కోర్ అనేది గతంలో తీసుకున్న రుణాల చెల్లింపుల ఆధారంగా లెక్కించబడుతుంది. కరోనా సమయంలో రుణాల చెల్లింపు సరిగ్గా లేకపోవటంతో ఆప్రభావం సిబిల్ స్కోర్ పై పడిందని పేర్కొన్నారు. దీంతో సిబిల్ స్కోర్ తక్కువగా వున్న ఎమ్.ఎస్.ఎమ్.ఈలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయటం లేదన్నారు. వీరికి మరో ముఖ్యమైన సమస్య ఏమిటంటే ఎమ్.ఎస్.ఎమ్.ఈలకు తమ ఉత్పత్తులు అమ్మిన వెంటనే కస్టమర్ల నుంచి చెల్లింపులు జరగవు. దీంతో రుణాల చెల్లింపు విషయంలో ఎమ్.ఎస్.ఎమ్.ఈలు ఆలస్యం చేయటం వల్ల సిబిల్ స్కోర్ తగ్గిపోతుందని వివరించారు.
ఈ సిబిల్ స్కోర్ తగ్గిపోవటం వల్ల ఎమ్.ఎస్.ఎమ్.ఈలు కొత్త రుణాలు పొందలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ రుణం మంజూరు చేసిన అధిక వడ్డీతో చేస్తున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితి ఎమ్.ఎస్.ఎమ్.ఈలను ఆర్థికంగా కష్టాల్లో పడేలా చేస్తోందన్నారు.
ఎమ్.ఎస్.ఎమ్.ఈలకు సిబిల్ స్కోర్ ఆధారంగా కాకుండా, వారి ఆదాయాన్ని బట్టి రుణ అర్హతను నిర్ణయించే ఆదాయ ఆధారిత రుణ అంచనా విధానం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను ప్రభుత్వం కూడా గుర్తించిందని తెలిపారు. 2024-25 కేంద్ర బడ్జెట్లో ఎమ్.ఎస్.ఎమ్.ఈల క్రెడిట్ స్కోర్పై ఆధారపడకుండా, వారి డిజిటల్ డేటా (Digital Footprints) ఆధారంగా ఆదాయ ఆధారిత కొత్త రుణ అంచనా విధానాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం సూచించదని వివరించారు. ఈ విధానం వల్ల ఎమ్.ఎస్.ఎమ్.ఈల వాస్తవ ఆర్థిక స్థితిని అర్థం చేసుకుని రుణాలు మంజూరు చేయడం సులభమవుతుందన్నారు.
ఈ కొత్త విధానం వల్ల MSMEs రుణాలు పొందడం సులభమవుతుంది. ప్రభుత్వం ఈ విధానం అమలుకు ఏ మేరకు చర్యలు తీసుకుందో వెల్లడించాలి” అని ఎంపీ కేసినేని శివనాథ్ కోరారు.
ఎమ్.ఎస్.ఎమ్.ఈలకు ఉపయోగపడే ఆదాయ ఆధారిత కొత్త రుణ అంచనా విధానం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వెల్లడించాలని ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News