గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో నైట్ స్ట్రీట్ ఫుడ్ జోన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, ఫుడ్ జోన్ ఏర్పాటుకు గుర్తించిన ప్రాంతాల్లో స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలు, సూచనలు తీసుకొని త్వరలో ఒక ప్రాంతాన్ని నిర్ణయిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శుక్రవారం పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు గల్లా మాధవి, అధికారులతో కలిసి అరండల్ పేట 4వ లైన్, పిచ్చుకల్ గుంట ప్రాంతాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో నైట్ స్ట్రీట్ ఫుడ్ జోన్ల ఏర్పాటు పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులతో కలిసి బ్రాడీపేట 4వ లైన్ ని పరిశీలించామన్నారు. అరండల్ పేట 4వ లైన్, పిచ్చుకల గుంట లైన్ లు కూడా ఫుడ్ జోన్ల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటాయన్న సూచనలకు అనుగుణంగా పరిశీలించామన్నారు. ప్రధానంగా నివాస ప్రాంతాలకు ఇబ్బంది లేకుండా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే రోడ్లపై ఆక్రమణల తొలగింపు, విస్తరణ పనులు త్వరలో చేపట్టి వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు.
పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు మాధవి మాట్లాడుతూ, నగరంలో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుండో ప్రజలు కోరుతున్నారని, అందుకు అనుగుణంగా అనుకూలమైన ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి పరిశీలిస్తున్నామన్నారు. అలాగే శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు ప్రారంభానికి ముందే ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసం బ్రాడీపేట అరండల్ పేటల్లో రోడ్ల ఆక్రమణలను తొలగించుకోవడం, అవసరమైన ప్రాంతాల్లో విస్తరణ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
పర్యటనలో కార్పొరేటర్ ఎం.శ్రీవల్లి, డిఈఈ రమేష్ బాబు, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News