-స్పెషల్ డ్రైవ్ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా 41 మంది నియామకం
-వచ్చే వారం ఇదే విధంగా అసోసియేట్ ప్రొఫెసర్లు మరియు ప్రొఫెసర్ల నియామకం
-సూపర్ స్పెషాలిటీలో 50 శాతం ఖాళీలను స్పెషల్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయాలి
-ఆదేశించిన వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
20 ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులు మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న సూపర్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి భారీఎత్తున చేపట్టిన ప్రత్యేక నియామక డ్రైవ్ కింద, వివిధ విభాగాల్లో సూపర్ స్పెషలిస్ట్ అర్హత కలిగిన 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను ప్రభుత్వం ఎంపిక చేసింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి వైద్య విద్య డైరెక్టరేట్ గత సోమవారం వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించింది. పత్రాల ధృవీకరణ తర్వాత, సంబంధిత విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు డిఎం మరియు ఎంసిహెచ్ అర్హత కలిగిన 41 మంది వైద్యులను నియమించినట్లు డిఎంఇ నేడు ప్రకటించింది.
స్పెషల్ డ్రైవ్ కింద ఈ 41 మంది సూపర్ స్పెషలిస్ట్లను నియమించడంతో ఖాళీల్లో 25 శాతం మేర తగ్గింది. ఈ రిక్రూట్మెంట్కు ముందు మంజూరైన 365 సూపర్ స్పెషాలిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల మొత్తం పోస్టుల్లో 166 పోస్టులు అంటే 45 శాతం ఈ ప్రత్యేక నియామకానికి ముందు ఖాళీగా ఉన్నాయి.
గత ప్రభుత్వం చెప్పుకున్నదానికంటే భిన్నంగా…ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇటీవల నిర్వహించిన సమీక్షలో సూపర్ స్పెషాలిటీ కేటగిరీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు మరియు ప్రొఫెసర్ల మొత్తం 682 పోస్టుల్లో 341 పోస్టులు (మొత్తం పోస్టులలో 50% ) ఖాళీగా ఉన్నాయని వెల్లడైంది. దీంతో ఆందోళన చెందిన ఆరోగ్య మంత్రి ఖాళీలను భర్తీ చేయడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు గత వారం వాక్ ఇన్ ఇంటర్వ్యూను డిఎంఇ నిర్వహించింది.
మంజూరు చేసిన 157 అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టుల్లో 79 పోస్టులు ( 50% ) ఖాళీగా ఉన్నాయి. 160 ప్రొఫెసర్ పోస్టులకు గాను 60% ఖాళీగా ఉన్నాయి. ఈ లోటును భర్తీ చేయడానికి వచ్చే వారం అసోసియేట్ ప్రొఫెసర్లు మరియు ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని వైద్య విద్య డైరెక్టర్ తెలిపారు.
టెరిషరీ ఆరోగ్య సంరక్షణ రంగంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్డియాలజీ, కార్డియో-థొరాసిక్ సర్జరీ, గ్యాస్ట్రో-ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో-ఎంటరాలజీ, ఎండోక్రినాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, నియో-నేటాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, సర్జికల్ ఆంకాలజీ మరియు యూరాలజీ వంటి 12 విభాగాలలో సూపర్ స్పెషాలిటీ సేవల్ని ప్రభుత్వం అందిస్తోంది.
సూపర్ స్పెషాలిటీ వైద్యులకు నెలకు రూ.30,000 అదనంగా ప్రోత్సాహకంగా ప్రభుత్వం చెల్లిస్తుంది.
Prajavartha Online Telugu News