గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార మాంస వ్యర్ధాల తరలింపుదారులపై చర్యలు తీసుకుంటామని, టెండర్ ద్వారా వ్యర్ధాల తరలింపు కాంట్రాక్ట్ పొందిన ఏజన్సీనే సోమవారం నుండి వ్యర్ధాలను నిర్దేశిత విధానంలో సేకరిస్తుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో చికెన్, మటన్ షాప్ ల అసోసియేషన్ ప్రతినిధులు, నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో రోడ్ల వెంబడి అనధికార చికెన్, మటన్, చేపల విక్రయాలు ప్రజారోగ్యం దృష్ట్యా నిషేధమన్నారు. ప్రజారోగ్య విభాగం నుండి అనధికార విక్రయాలు జరగకుండా ప్రత్యెక పర్యవేక్షణకు బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. విక్రయదారులు నిర్దేశిత షాప్ లో లైసెన్స్ లు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే ఆయా మాంస విక్రయ షాప్ ల నుండి వచ్చే వ్యర్ధాలను జిఎంసి నుండి టెండర్ పొందిన ఏజన్సీ సోమవారం నుండి పూర్తీ స్థాయిలో సేకరణ చేయాలని, సేకరణలో లోపం ఉంటే టెండర్ నిబందనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో సిఎంఓహెచ్ డాక్టర్ అమృతం, విఏఎస్ డాక్టర్ వెంకటేస్వర్లు, ఎస్ఎస్ లు, చికెన్ స్టాల్స్ అసోసియేషన్ ప్రతినిధులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News