-అద్దంకి నియోజకవర్గ పరిధిలో రూ.3 కోట్లతో రెండు విద్యాలయాల నిర్మాణం
-బాలికల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది
-ప్రైవేటు స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి
-వైసీపీ ప్రభుత్వ చర్యలతో 12,000 మందిపైగా పాఠశాల విద్యకు దూరం
-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త :
దశాబ్దాల క్రితమే మహిళల విద్య కొరకు అలుపెరగని పోరాటం చేసిన జ్యోతీరావు పూలే, సావిత్రీబాయిల ఆదర్శంగా రాష్ట్ర వ్యాప్తంగా కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ, ఏల్చూరులలో కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాలకు మంత్రి గొట్టిపాటి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అద్దంకి నియోజకవర్గ పరిధిలో సుమారు రూ.3 కోట్లతో రెండు బాలికల విద్యాలయాను నిర్మిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బాలికల విద్య పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు స్పష్టం చేశారు. ఆరు నెలల వ్యవధిలోనే విద్యాలయాల నిర్మాణాలను పూర్తి చేసి విద్యార్థినిలకు అందుబాటులోకి తీసుకు వస్తామని మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో పాఠశాల విద్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం విద్యను పేదలకు దూరం చేయడమే కాకుండా నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని మంత్రి గొట్టిపాటి ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో కస్తూర్భా విద్యాలయాల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థినిలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అదే విధంగా వైసీపీ ప్రభుత్వం దాదాపు 12,000 మంది పైగా విద్యార్థులు పాఠశాల విద్యకు దూరమై, డ్రాపవుట్స్ గా మిగిలారని మంత్రి గొట్టిపాటి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాధమిక హక్కు అయిన విద్యను అందరికీ అందించే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ ప్రణాళికలు రూపొందించారని వివరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూల్స్ కు ధీటుగా అభివృద్ధి చేసేందుకు మంత్రి లోకేష్ నిధులు మంజూరు చేస్తున్నారని వివరించారు. అదే విధంగా దాతల సహకారంతో కస్తూర్భా విద్యాలయాల బాలికలకు నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు గొట్టిపాటి వెల్లడించారు.
రైతులకు వ్యవసాయ పనిముట్ల పంపిణీ…
రాయితీ వ్యవసాయ పనిముట్లతో అన్నదాతకు ఆర్థిక చేయూత లభిస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా బల్లికురవ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నాడు ప్రజా వేదిక నిర్వహించిన మంత్రి… ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజా వేదిక ద్వారా వచ్చిన విజ్ఞప్తులును వెంటనే పరిష్కరించాలని.. అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. స్థానిక రైతులకు వ్యవసాయ పరికరాలను మంత్రి గొట్టిపాటి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు ఎంతో ఉపయుక్తమైన ఆదరణ పథకాన్ని రద్దు చేసిందని గుర్తు చేశారు. ఉపాధి హామీ చట్టంలోనూ అవినీతికి పాల్పడిన వైసీపీ నేతలు పేదల నోళ్లు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఆదరణ పథకాన్ని పునరుద్ధరించిందన్నారు. అదే విధంగా ఉపాధి హామీ చట్టాన్నీపటిష్టంగా అమలు చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో కూటమి నేతలతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News