గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్మార్ట్ టెక్స్, జిఎంసి ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా నిర్వహణకు త్వరలో తేదీలను ఖరారు చేస్తామని, గుంటూరు నగరం మరియు గుంటూరు జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతకు మరొకసారి శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, కావున ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని సచివాలయాల్లో క్యూ ఆర్ కోడ్ ద్వారా రిజిస్టేషన్ చేసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, స్మార్ట్ టెక్స్, జిఎంసి ఆధ్వర్యంలో నగరంలో 10వ తరగతి పైన చదివిన నిరుద్యోగ యువతకు వారి అర్హతకు తగిన విధంగా ఉండేలా షుమారు 50 కంపెనీల నుండి ఉద్యోగాలు అందించేలా గుంటూరులో యన్.టి.ఆర్ క్రీడాప్రాంగణం నందు ఈ నెలలో మెగా జాబ్ మేళాకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇప్పటికే 2600 మంది క్యూ ఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, వారికి వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిపుణుల బృందంతో శిక్షణా తరగతులు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎక్కువమంది నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించేందుకు గడువు పెంచామని, సుమారు 10 వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. రిజిస్టర్ చేయించుకొని శిక్షణకు హాజరు కాని వారికి మరియు నూతనంగా రిజిస్టర్ చేయించుకొనే వారి కొరకు వచ్చే వారంలో శిక్షణా తరగతులు నిర్వహించి, మెగా జాబు మేళా నిర్వహించిన పిదప మెగా జాబు మేళా తేదీ ప్రకటిస్తామన్నారు. ఐటి, నాన్ ఐటి, బ్యాంకింగ్, ఫార్మసీ, నర్సింగ్ రంగాల్లోని వివిధ కంపెనీలు నిర్వహించే ఉద్యోగాల కల్పనకు ఆసక్తి కనబరస్తున్నాయని, నగరంలో ఆసక్తి కల్గిన నిరుద్యోగ యువత తమకు అందుబాటులోని వార్డ్ సచివాలయంలో క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్టేషన్ చేసుకోవాలని కోరారు.
Prajavartha Online Telugu News