మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో ఇతరుల మాదిరిగానే విభిన్న ప్రతిభావంతులు చాలా గర్వంగా బ్రతకాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్లో పాఠశాల విద్య– సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశామని వాళ్లకు ఏ ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించడం జరిగిందన్నారు. ఆ మేరకు జిల్లాలో 132 మందికి 212 బ్యాటరీ మూడు చక్రాల వాహనాలు, చక్రాల కుర్చీలు, మూడు చక్రాల వాహనాలు, నడక కర్రలు తదితర ప్రత్యేక పరికరాలు 15,63,218 రూపాయల విలువతో కేంద్ర ప్రభుత్వం తరఫున అలింకో సంస్థ సహకారంతో అందజేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని విభిన్న ప్రతిభావంతులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ సందర్భంగా లబ్ధిపొందిన దివ్యాంగులు తమకు మూడు చక్రాల వాహనాలు అందించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అధికారి డి టి డబ్ల్యూ ఫణి ధూర్జటి, దివ్యాంగుల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News