-ఈ ఘటనపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీవ్ర మనో వేదనకు గురయ్యారు
-జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె.నాగబాబు
-హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో జనసేన పార్టీ కొవ్వొత్తుల ప్రదర్శన
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
జమ్ము కాశ్మీర్ లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దాడిని ముక్త కంఠంతో ఖండిస్తున్నామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు కె.నాగబాబు స్పష్టం చేశారు. ప్లకార్డుల ప్రదర్శన ద్వారా వెల్లడించారు. పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ మృతులకు సంతాపం తెలియజేయాలని అధ్యక్షులు పవన్ కల్యాణ్ పిలుపు మేరకు బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో నాగబాబు పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి హేయమైనదని స్పష్టం చేశారు. ఈ ఘటన పట్ల అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీవ్ర మనోవేదనకు గురయ్యారన్నారు. ఈ ఘటనకు కారకులను కఠినంగా శిక్షించి బలమైన పాఠం చెప్పాలన్నారు. బాధిత కుటుంబాల వేదన కలచి వేస్తోందని, మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతున్నట్లు ప్రకటించారు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కోశాధికారి ఎ.వి.రత్నం, తెలంగాణ నాయకులు సాగర్ ఆర్. కె. నాయుడు, ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, రాధారం రాజలింగం, దామోదర్ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News