-బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రాష్ట్ర మంత్రి పార్ధసారధి..
ఏలూరు/నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
జమ్మూ కాశ్మీర్లోని బైసరన్, పహల్గామ్, అనంత్నాగ్లలో అమాయక పర్యాటకులు, స్థానికులపై మంగళవారం జరిగిన ఉగ్రదాడిని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి తీవ్రంగా ఖండించారు. దీనిని హేయమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న, అనేక మందిని గాయపరిచిన సంఘటన అనాగరిక చర్య అన్నారు. మానవత్వం, శాంతి, కాశ్మీర్ ఆతిథ్య స్ఫూర్తిపై దాడిగా ఆయన పేర్కొన్నారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామన్నారు. నాగరిక సమాజంలో ఇటువంటి హింసకు స్థానం లేదన్నారు. అత్యంత హేయమైన దాడికి పాల్పడిన హంతకులు, వారి వెనుకవున్నవారిని న్యాయస్ధానం ముందుకు తీసుకురావాలన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మరియు జమ్మూ కాశ్మీర్ ప్రజలతో సంఘీభావంగా భారత్ ఐక్యంగా నిలుస్తుందన్నారు.
Prajavartha Online Telugu News