-భావితరాలకు ఆదర్శప్రాయుడు డా.బిఆర్.అంబేద్కర్
-అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
మడకశిర, నేటి పత్రిక ప్రజావార్త :
అణగారిన వర్గాల ఆశా కిరణం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మడకశిర పట్టణంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే రాజు మరియు ఎమ్మెల్సీ తిప్పే స్వామితో కలిసి ఎన్టీఆర్ సర్కిల్ నందు అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ తన జీవితాన్ని ధారపోశారని కొనియాడారు. అంబేద్కర్ గారి ఆశయాలను ప్రతిఒక్కరూ ముందుకు తీసుకు వెళ్ళాలని, ఆయన మార్గం అందరికీ అనుసరణీయమనన్నారు. ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఆయన రాసిన రాజ్యాంగం యొక్క విలువల ఆధారంగా స్వాతంత్రాన్ని పొందగాలిగాయన్నారు. మన దేశంలో ప్రజాస్వామ్య బద్దంగా నిలబడటానికి ప్రధాన కారణం ఆయన రాసిన రాజ్యాంగమే అని, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా ఎప్పటికి నిలిచిపోయిన మహానీయుడన్నారు. అట్టడుగు వర్గంలో జన్మించి ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా ఉన్నత చదువులు చదివిన గొప్ప వ్యక్తి ఆంబేద్కర్ అన్నారు. నేటికీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే దేశం నడుస్తోందన్నారు. దేశ భవిష్యత్ అవసరాలను ముందే ఊహించి, వాటి పరిష్కార మార్గాలను రాజ్యాంగంలో పొందుపరిచిన దాస్నికుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని మంత్రి కొనియాడారు.
ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. అంతకుముందు మంత్రివర్యులు ఎమ్మెల్సీ తిప్పేస్వామి, ఎమ్మెల్యే రాజు కలిసి డప్పు వాయించారు.
Prajavartha Online Telugu News