-పటిష్ట సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం
-రాష్ట్ర వ్యవసాయ, సహకారం, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 2న అమరావతి రాజధాని పునః ప్రారంభ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు గౌరవ ప్రధానమంత్రి రానున్న నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధుల పటిష్ట సమన్వయంతో కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకారం, మార్కెటింగ్, పశుసంరక్షణ, డెయిరీ డెవలప్మెంట్, మత్స్య శాఖామంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తదితరులు సమావేశమై కార్యక్రమానికి చేస్తున్న ఏర్పాట్లపై చర్చించారు. బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకునేందుకు అందుబాటులో ఉన్న మార్గాలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు చేస్తున్న ఏర్పాట్లు, అతిథులకు వసతి, ప్రయాణ ఏర్పాట్లు తదితరాలపై సమావేశంలో చర్చించారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా, మంత్రివర్గ కమిటీ సూచనలు తదితరాల ఆధారంగా చేస్తున్న పనులు ఏ దశలో ఉన్నాయో పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు రానున్నారని.. విజయవాడ అర్బన్ పరిధిలోని మూడు నియోజకవర్గాల నుంచి దాదాపు 20 వేలు మంది చొప్పున కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో వారికి ఇబ్బంది లేకుండా చేస్తున్న ఏర్పాట్లపై చర్చించారు. అదేవిధంగా తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల నుంచి వచ్చే వివిధ రంగాలకు చెందిన వారికి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని, ఇందుకు ప్రత్యేకంగా నియమించిన లైజనింగ్ అధికారులు దృష్టిపెట్టాలని ఆదేశించారు. వేసవి నేపథ్యంలో తాగునీటిని అందుబాటులో ఉంచడంతో పాటు ఎక్కడికక్కడ వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ ద్వారా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, నోడల్ అధికారులు, ప్రోటోకాల్ లైజనింగ్ అధికారులు, రూట్ అధికారులు, హోటల్ లైజనింగ్ అధికారులు తదితరులు ప్రణాళిక ప్రకారం విధులు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News