-ఐదేళ్లు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
-కూటమితో అమరావతికి పునర్వైభవం
-పునర్నిర్మాణ సభ విజయమే రాజధానికి మద్ధతు
-ప్రధాని సభ ఏర్పాట్లపై సహచర మంత్రులతో గొట్టిపాటి సమీక్ష
తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అమరావతి రాజధాని నిర్మాణం కోసం ముందుగా ఒక్క రూపాయి తీసుకోకుండా భూములు ఇచ్చిన రైతులను జగన్ మోహన్ రెడ్డి నిండా ముంచాడని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మే 2వ తేదీన ప్రధాని ముఖ్య అతిథిగా జరిగే అమరావతి రాజధాని పునర్నిర్మాణ సభను విజయవంతం చేయడానికి చేయాల్సిన ఏర్పాట్లపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో సహచర మంత్రులు అనగాని సత్య ప్రసాద్, డోలా బాల వీరాంజనేయ స్వామి, కొలుసు పార్థ సారధిలతో పాటు బాపట్ల ప్రాంతానికి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు, బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ… రాజధాని అమరావతి ప్రాంతంలోనూ జగన్ మోహన్ రెడ్డిని నమ్మి ఎంతో మంది రైతులు వైసీపీని గెలిపిస్తే… అధికారంలోకి వచ్చిన తరువాత.. ఓటేసిన అన్నదాతకు తీరని అన్యాయం చేశాడని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో వేల ఎకరాలు ఇచ్చిన రైతుల నమ్మకాన్ని జగన్ సర్వ నాశనం చేశాడన్నారు. మరో వైపు మూడు రాజధానులు అంటూ… కుటిల రాజకీయంతో రాష్ట్ర ప్రజలను జగన్ మాయ చేశాడని మంత్రి గొట్టిపాటి ఎద్దేవా చేశారు. చివరకు ఆంధ్ర ప్రదేశ్ ని ఐదేళ్లు రాజధాని లేని రాష్ట్రంగా మార్చాడని పేర్కొన్నారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత… అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు, రాష్ట్ర ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరలా రాజధాని పునర్నిర్మాణం ప్రారంభించినట్లు మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. మే 2వ తేదీ ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా పాల్గొనే అమరావతి రాజధాని పునర్నిర్మాణ సభకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది తరలి వచ్చి మద్థతు ప్రకటించాలని పిలుపు నిచ్చారు. అదే విధంగా బాపట్ల ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పునర్నిర్మాణ సభకు ప్రజలు వచ్చే విధంగా కూటమి నేతలు ఏర్పాట్లు చేయాలని బాపట్ల ప్రాంత ఎమ్మెల్యేలను మంత్రి గొట్టిపాటి దిశా నిర్దేశం చేశారు. అదే విధంగా సభకు వచ్చే వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎండాకాలం కావడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి మంచినీరు, మజ్జిగ, అల్పాహారం వంటి వాటికి ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందని… వాటిని సమన్వయం చేసుకుని సభకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు ఎన్డీఏ పక్ష నేతలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News