-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కార్మికుల పోరాట స్ఫూర్తి, చైతన్యానికి ప్రతీక మేడే సందర్భంగా కార్మిక సోదరులకు వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికుల శ్రమ దేశ సంపద సృష్టికి మూలమని.. జాతి నిర్మాణంలో కార్మికుల చెమట, రక్తం ఉన్నాయన్నారు. మన సమాజ గతిని.. పురోగతిని శాసించేది, నిర్దేశించేది శ్రామిక వర్గమే అని చెప్పారు. కార్మికుల ప్రయోజనాల పరిరక్షణలో, కార్మిక సోదరుల సంక్షేమం కోసం పథకాలు రచించటంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన దేశంలోనే సువర్ణ అధ్యాయమని మల్లాది విష్ణు అన్నారు. ఆ మహానేత స్పూర్తితో కార్మికుల పక్షపాతిగా.. వారి హక్కుల పరిరక్షణకు, కార్మికుల కుటుంబాలు మరింత సంతోషంగా ఉండేందుకు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలా పాటుపడిందన్నారు. కార్మికులకు మేలు చేకూర్చే ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఒక్క సెంట్రల్ నియోజకవర్గంలోనే వాహనమిత్ర ద్వారా 2,265 మందికి ఐదేళ్లలో దాదాపు రూ. 10 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించినట్లు వెల్లడించారు. జగనన్న చేదోడు పథకం ద్వారా దర్జీలను ఆర్థికంగా ఆదుకున్నారని.. సెంట్రల్ నియోజకవర్గంలో 1,692 మంది టైలర్స్ సోదరసోదరీమణులకు చేదోడు పథకం ద్వారా ఏటా రూ. 10 వేలు అందించడం జరిగిందన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినట్లు వివరించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక కార్మిక సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో కార్మికుల సంక్షేమం కోసం ప్రకటించిన ఏ ఒక్క హామీ అమలుచేయకపోగా.. గత వైసీపీ ప్రభుత్వ పథకాలను సైతం తొలగించారని విమర్శించారు. వైఎస్సార్ బీమా పథకానికి చంద్రన్న బీమా అని పేరు మార్చటమే తప్ప ఇప్పటివరకు ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. ఈ ప్రభుత్వంలో కార్మికులకు నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళటం కూడా కష్టమైపోయిందని.. కనుక ఎన్నికల హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్బంగా కార్మిక సోదరులకు మరోసారి ఆయన మేడే శుభాకాంక్షలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News