అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని ముఖ్యమైన దేవాలయాల్లో పరిపాలనా లోపాలు, తరచూ జరుగుతున్న భద్రతా వైఫల్యాలపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని డా.మద్దిల గురుమూర్తి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి మరోసారి లేఖ రాశారు.
విశాఖపట్నం జిల్లా సింహాచలం దేవాలయంలో చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గూర్చి ఆయనకి ఈ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. గోడ నిర్మాణంలో సరైన ఇంజనీరింగ్ పద్ధతులు పాటించక పోవడం, నాణ్యత లేని మెటీరియల్ ఉపయోగించడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని ఎంపీ ఈ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు పుణ్యక్షేత్రాలలో ఇటీవల జరిగిన సంఘటనలని ఈ లేఖ ద్వారా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంలోని శ్రీ కూర్మనాథ స్వామి ఆలయంలో భక్తులు పవిత్రంగా బావించే అరుదైన నక్షత్ర తాబేళ్లు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం, పోస్టుమార్టం చేయకుండానే వీటి దహనం చేయడం చట్టాలను, సంప్రదాయాలను ఉల్లంఘించడమే అని తెలిపారు.
తిరుమలలో భద్రతా వ్యవస్థ పూర్తిగా తలకిందులైందని, జనవరి 8న వైకుంఠ ద్వార దర్శన కౌంటర్ల క్యూ లైన్లలో జరిగిన దురదృష్టకరమైన తొక్కిసలాట తర్వాత కూడా టీటీడీ పరిపాలనలో ఎలాంటి మార్పు రాకపోవడం బాధాకరం అన్నారు. ఇటీవల కాలంలో మూడంచెల భద్రతా వ్యవస్థను దాటి ఒక భక్తుడు పాదరక్షలతో సింహ ద్వారం వరకు వెళ్లడం వ్యవస్థలోని లోపాలు కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయని తెలిపారు. అలాగే టిటిడి గోశాలలో 100 కంటే ఎక్కువ గోవులు మరణించిన ఘటన గురించి ప్రస్థావిస్తూ గోశాల నిర్వహణలో నిర్లక్ష్యం, గోవులకి నాణ్యతలేని దాణా అందించడం, వైద్య సేవల లోపం, అజాగ్రత్త వెరసి గోవుల మరణానికి కారణమాయ్యాయని ఇవన్నీ కూడా పాలనా విఫలమయింది అనేందుకు నిదర్శనాలని ఈ లేఖ లో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో భద్రతా వైఫల్యలపై వెంటనే ప్రత్యేక విచారణకు ఆదేశించాలని, బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి విజ్ఞప్తి చేశారు. భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు, భద్రతను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ జోక్యం అవసరమని ఎంపీ కోరారు. భారత దేశం యొక్క ఆధ్యాత్మిక వారసత్వాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరి మీద ఉందని ఈ సందర్బంగా ఎంపీ గురుమూర్తి తెలియజేశారు.
Prajavartha Online Telugu News