-మంత్రి కందుల దుర్గేష్ చొరవతో నిడదవోలు నియోజకవర్గ రోడ్ల మరమ్మత్తులకు రూ.5.10 కోట్లు విడుదల
-ఎర్రచెరువు – పి. వేమవరం, వడ్లూరు – తీపర్రు, తీతలి – మునిపల్లి రోడ్లకు మరమ్మత్తులు షురూ
-యుద్ధ ప్రాతిపదికన ఇక రోడ్లు బాగుపడతాయ్ అని తెలిపిన మంత్రి దుర్గేష్
-నియోజకవర్గ ప్రజల తరపున సీఎం, డిప్యూటీ సీఎం, ఆర్ అండ్ బి మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి దుర్గేష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీలో రహదారుల మరమ్మతులకు నాబార్డు క్రింద నిధులు విడుదల చేసిన నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక చొరవతో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించిన 3 ఆర్ అండ్ బీ రోడ్ల మరమ్మతులకు రూ. 5.10 కోట్లు విడుదలయ్యాయి. వియత్నాం పర్యటనలో ఉన్న మంత్రి కందుల దుర్గేష్ ఈ విషయాన్ని ధృవీకరించారు. అందులో భాగంగా ఎర్రచెరువు – పి. వేమవరం రహదారి మరమ్మత్తుకు సంబంధించి 3.607 కి.మీల కు గానూ రూ.126 లక్షలు, వడ్లూరు – తీపర్రు రోడ్డుకు సంబంధించి 8.50 కి.మీ రహదారి మరమ్మత్తులకు రూ.324 లక్షలు మంజూరు అయ్యాయి. అదే విధంగా తీతలి – మునిపల్లి రోడ్డులో 0.40 కి.మీల మరమ్మత్తులకు రూ.60 లక్షలు మంజూరు అయినట్లు మంత్రి దుర్గేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుంతలు లేని రహదారులే లక్ష్యంగా రోడ్లకు మరమ్మతులు చేపట్టేందుకు నిధులు విడుదల చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి బి.సి. జనార్థన్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం రోడ్లను పట్టించుకోని కారణంగా అధ్వాన్నంగా తయారయ్యాయని, ఇక యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు చేపడతామని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. త్వరలోనే నిడదవోలు నియోజకవర్గంలో మరిన్ని రోడ్లకు మహర్ధశ వస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.
Prajavartha Online Telugu News