విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద బ్రాహ్మణులకు చేయూతనందించడంలో గాయత్రీ సొసైటీ, బ్రాహ్మణ సేవా సంఘం పాత్ర అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ కార్యక్రమం బ్రాహ్మణ సేవా సంఘం మరియు గాయత్రీ సోసైటీ ఆధ్వర్యంలో ఆదివారం సత్యనారాయణపురంలోని శ్రీ గాయత్రి కళ్యాణ మండపం నందు జరిగింది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బ్రాహ్మణ సామాజికవర్గ అభ్యున్నతికి దశాబ్ధకాలంగా గాయత్రీ సొసైటీ చేస్తున్న సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. మరీముఖ్యంగా కరోనా కష్టకాలంలో పేద బ్రాహ్మణులకు చేయూతనందించడంలో, మెడికల్ క్యాంపులు నిర్వహించడంలో సొసైటీ పాత్ర మరువరానిదన్నారు. సాంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని కాపాడుకునే విధంగా ఏటా సామూహిక ఉపనయన మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికకు మంచి ఆదరణ లభిస్తోందని మల్లాది విష్ణు అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తి, బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు కొప్పరపు బలరాం, శ్రీరామ చంద్రమూర్తి, తణుకు రామకృష్ణ, కొప్పరపు మారుతీ, జె.కె.సుబ్బారావు, చల్లా సుధాకర్, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News