-కలెక్టరేట్లో ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
భగీరధుని స్ఫూర్తితో జీవితంలో అనుకున్నది సాధించవచ్చని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశపు మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన భగీరథ మహర్షి జయంతి వేడుకల కార్యక్రమంలో భగీరథ మహర్షి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తపస్సుతో గంగను దివి నుంచి భువికి దించిన భగీరథుడు మహ తపస్వీ అన్నారు. పట్టుదలకు మారుపేరుగా నిలిచారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చని అన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖరరావు మాట్లాడుతూ ప్రయత్నానికి మారుపేరు భగీరథ మహర్షి అని, భగీరథ ప్రయత్నం స్ఫూర్తితో అసాధ్యమైన దానిని సుసాధ్యం చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి వీరాంజనేయ ప్రసాద్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు, సగర కుల సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News