అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. సభ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశమయ్యారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా, ప్రజలు ఇబ్బందులు పడకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. భవిష్యత్లోనూ ఇదే తరహాలో సమిష్టిగా సమన్వయంతో పని చేసి ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతమయ్యేలా చూడాలని సూచించారు. పర్యటన ఆసాంతం సక్సెస్ అయ్యేలా సమన్వయం కోసం అన్ని స్ధాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకోవడం, విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించడం ద్వారా సభ సజావుగా సాగిందని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, మంత్రి నారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News