విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గాంధీ హిల్ ఫౌండేషన్ నూతన కమిటీ ఆధ్వర్యంలో ఇకపై గాంధీ హిల్ వేదికగా ఆ సంస్థ కార్యకలాపాలు జరుగుతాయని ఆ సంస్థ చైర్మన్ డా. గాంధీ పిసి కాజా తెలిపారు. ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా1968-69 లో విజయవాడలో గాంధీ పర్వతాన్ని ప్రారంభించడం జరిగిందని, 1968 అక్టోబర్ 6 వ తేదీ గాంధీ స్థూపాన్ని అప్పటి భారత దేశాధ్యక్షులు డాక్టర్ జాకీర్ హుస్సేన్ ప్రారంభించారని, తదుపరి 1977 లో గాంధీ హిల్ ఫౌండేషన్ ఏర్పాటు చేయటం జరిగిందిని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం 2017 లో గాంధీ హిల్ వద్ద నూతనంగా ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి పేరుతో రిజిస్టరై, నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు.
అనంతరం ఆ సంస్థ కార్యదర్శి వై. రామచంద్రరావు మాట్లాడుతూ 2025 మే 8 వ తేదీ గాంధీ హిల్ వద్ద నూతనంగా ఏర్పాటైన గాంధీ హిల్ ఫౌండేషన్ సమావేశం జరిగిందని. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఎక్స్- అఫిషియో మెంబర్లుగా పాల్గొన్న ఈ సమావేశం లో ఈ నూతన కమిటీకి డాక్టర్ గాంధీ పి.సి.కాజ అధ్యక్షులుగా, వై.రామచంద్రరావు కార్యదర్శిగా వ్యవహరిస్తారని వారితో పాటు డాక్టర్ జంధ్యాల శంకర్, డాక్టర్ రావి శారద, ఐ.ప్రసాద రాజు, రశ్మీ సమరం, డాక్టర్ జి.వి.మోహన ప్రసాద్ లతో కూడిన 11 మంది కమిటీ ఏర్పాటైంది తెలిపారు.
ఈ సమావేశంలో ఒకప్పుడు విజయవాడ నగరానికే గర్వకారణంగా వున్న గాంధీ పర్వతం ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. గాంధీ హిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఆ సంస్థ అభివృద్ధికి చేపట్టవలసిన పనులను, దశలవారీగా వివరరించారు. తొలిదశలో (2025-2027) ప్రధాన ప్రాముఖ్యతగల ఉపయుక్తమైన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. గాంధీ హిల్ సుందరీకరణ లో భాగంగా ప్రధాన ఎంట్రన్స్ వద్ద ఆర్చి అందంగా తీర్చి దిద్దటం, లాండ్ స్కేపింగ్, ఎంట్రన్స్ నుండి స్థూపం వరకు ఉన్న అప్రోచ్ రోడ్డు సరిచేయటం, పిల్లలు అడుకునే పార్క్ ప్రాంతాన్ని సరిచేయటం, చుట్టుపక్కల ప్రాంతాన్ని అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్ది అత్యాధునిక ట్రైన్ ఏర్పాటుకు చక్కని రూపకల్పన చేసి సందర్శకులను ఆకర్షణగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇప్పటికే జర్మనీ టెక్నాలజీతో వి.ఎం.సి. వారు నూతనంగా ఏర్పాటు చేసిన ప్లానిటోరియం యువతకు, పెద్దలకు ఆకర్షణ నిలిచిందని అన్నారు. 2025 గాంధీ జయంతి నాటికి కొంత మార్పులు చేసి గాంధీ హిల్ పైన గాంధీ జయంతి వేడుకలను నిర్వహిస్తామని తెలిపారు.
వి.ఎం.సి. తదితర స్థానిక ప్రభుత్వ సంస్థలతో, పారిశ్రామిక సంస్థలతో, జనరల్ పబ్లిక్ తో MOU లు ఉంటాయని, ఆ సంస్థ బై లాస్ ప్రకారం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గాంధీ పర్వత సంస్థకు చీఫ్ పాట్రన్ గా ఉంటారని, వారి గైడెన్స్, సలహాల మేరకు గాంధీ హిల్ ను స్థానిక, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ కేంద్రంగా అభివృద్ధి పరచడమే లక్ష్యమని తెలిపారు.
Prajavartha Online Telugu News