విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ సిబ్బంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. జాతీయ హైపర్ టెన్షన్ డే సందర్భంగా శనివారం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యంలో విఎంసి సిబ్బందికి ఉచితంగా బీపీ (రక్తపోటు) మరియు షుగర్ (రక్తంలో గ్లూకోజ్) పరీక్షలు నిర్వహించాయి.
ఈ కార్యక్రమంలో కమిషనర్ ధ్యాన చంద్ర మాట్లాడుతూ, సిబ్బంది ఆరోగ్యం సంస్థ పనితీరును ప్రతిబింబిస్తుందని, సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే వారు విధులను సమర్థవంతంగా నిర్వహించగలరని, అందుకే ప్రతి ఉద్యోగి ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని, వారి ఆరోగ్య స్థితిని పర్యవేక్షించాలని నిర్ణయించారని అన్నారు. కమిషనర్ ఆదేశాల ప్రకారం, నిర్వహించిన బీపీ, షుగర్ పరీక్షల ఫలితాలను సిబ్బందితో చర్చించి, అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయా విభాగాధికారులకు ఆదేశించారు. అలాగే సిబ్బంది ఆరోగ్యానికి సంబంధించి విభాగాల వారీగా ఆరోగ్య సమాచారం నమోదు చేసి, అవసరమైన వైద్య సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
కార్యాలయ వాతావరణం సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, సిబ్బంది ఆరోగ్యానికి సహకరించే విధంగా మెరుగైన చిట్కాలు, సూచనలు ఇవ్వాలని కమిషనర్ చెప్పారు. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఈ తరహా ఆరోగ్య శిబిరాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని, వీటిని పర్యాయ కాలంలో నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
Prajavartha Online Telugu News