-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS.,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాలలను, విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే ముందుగా ప్రిన్సిపల్స్ మారాలి. వారు పరిపాలకులు కాదు, మార్పు దిశగా నడిపించే నాయకులని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., అన్నారు.
సమగ్ర శిక్షా – సీమ్యాట్ (SIEMAT) విభాగం ఆధ్వర్యంలో, ప్రపంచ బ్యాంకు మద్ధతుతో అమలవుతున్న సాల్ట్ (SALT – Supporting Andhra’s Learning Transformation) ప్రాజెక్టులో భాగంగా ప్రధానోపాధ్యాయులకు ఐదు రోజుల మాస్టర్ ఫెసిలిటేటర్స్ శిక్షణా కార్యక్రమం ఏలూరు జిల్లా ఆగిరపల్లి మండలం హీల్ పారడైస్ ప్రాంగణంలో సోమవారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఆన్ లైన్ ద్వారా హాజరైన సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలల నేతృత్వాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ శిక్షణ నిర్వహిస్తున్నామని, మంచి పాఠశాలలు సృష్టించాలంటే ప్రతిభావంతమైన నాయకత్వం అవసరమని, ఈ శిక్షణ నాయకత్వ దిశగా తీర్చిదిద్దేందుకు ఒక ముందడుగు” అని పేర్కొన్నారు. అనంతరం సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న 350 మంది మాస్టర్ ఫెసిలిటేటర్లకు శిక్షణా ప్రణాళికను వివరిస్తూ సామర్థ్యాల ఆధారంగా రూపొందించిన శిక్షణ అని, ప్రతి ఫెసిలిటేటర్ ప్రధానోపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీమ్యాట్, సత్త్వ & కైవల్య బృందాలు పాల్గొన్నాయి. ఈ నెల 23వ తేదీ వరకు శిక్షణ కొనసాగుతుంది.
Prajavartha Online Telugu News