-క్రీడలు చిన్నారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి – జాస్తి సాంబశివరావు, కార్పొరేటర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పిల్లల మానసిక వికాసానికి క్రీడలు ఎంతో ముఖ్యమని డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ ఇంచార్జ్ డాక్టర్ KNBS లత అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆదేశాల మేరకు నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ లో భాగంగా వేసవి క్రీడా శిక్షణలో పాల్గొన్న బాల బాలికలకు ముగింపు కార్యక్రమంలో గురు నానక్ కాలనీ, స్విమ్మింగ్ పూల్ నందు ఈత పోటీలు నిర్వహించి, ప్రతిభావంతులకు మెడల్స్ అందించారు డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ డాక్టర్ KNBS లత, స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్చార్జ్ డాక్టర్ KNBS లత మాట్లాడుతూ వేసవి క్రీడా శిక్షణలో భాగంగా మే 1 నుండి మే 31 వరకు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోగల అన్ని విఎంసి వేసవి శిక్షణ కేంద్రాలలో స్కేటింగ్, షటిల్ బ్యాట్మెంటన్, స్విమ్మింగ్, వంటి క్రీడల్లో శిక్షణ ఇచ్చారని, అందులో భాగంగా ముగింపు కార్యక్రమంలో గురునానక్ కాలనీలో గల స్విమ్మింగ్ పూల్ నందు ఈతల పోటీలను, సీనియర్స్, జూనియర్స్ గా విభజించి రెండు విభాగాలుగా నిర్వహించి 12 మంది ప్రతిభావంతులకు పతకాలు అందించారని తెలిపారు. చిన్నారులు కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా రాణించాలని వారి మానసిక వికాసానికి క్రీడలు ఎంతో ముఖ్యమని అన్నారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ పర్యవేక్షణలో వేసవి కాలాన్ని సద్వినియోగం చేసుకునేలా చిన్నారుల కోసం నిర్వహించిన ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని, మానవ జీవితంలో చదువు ఎంత ముఖ్యమో, అదే విధంగా శారీరక ఆరోగ్యం, మానసిక వికాసం కోసం క్రీడలు కూడా అంతే అవసరంమని, క్రీడలు చిన్నారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని, నిబంధనలు పాటించడం, సమయం విలువ తెలుసుకోవడం వంటి విలువలను నేర్పుతాయని అన్నారు. ఈత పోటీల్లో పాల్గొన్న ప్రతి చిన్నారి విజేతలని, వారందరిలో ఉన్న ప్రతిభను ఈ శిక్షణ మరియు పోటీలు వెలికి తీసి, భవిష్యత్తులో ప్రతిష్టాత్మక క్రీడా రంగాల్లో వారు ఎదగడానికి బలమైన పునాదిని వేస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, మెడల్స్ స్పాన్సర్ అరుణ, పూల్ ఇంచార్జి అప్పారావు, స్విమ్మింగ్ కోచ్లు కుసుమ, గౌతమ్, బహుధుర్, వేసవి శిక్షణ చిన్నారుల తల్లి తండ్రులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News