– తాగునీరు కలుషితం కాకుండా అప్రమత్తంగా ఉండాలి
– డ్రెయిన్లలో డీ సిల్టేషన్కు స్పెషల్ డ్రైవ్ చేపట్టండి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రజలకు సురక్షిత తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని.. ఎక్కడా తాగునీరు కలుషితం కాకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ లక్ష్మీశ బుధవారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు ప్రబలకుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలని.. డెంగీ, మలేరియా, డయేరియా కేసులు నమోదుకాకుండా క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కృషిచేయాలన్నారు. ఎక్కడైనా వ్యాధి కేసు నమోదైతే పరిసర ప్రాంతాలలో ఇంటింటి సర్వే నిర్వహించి, నివారణ చర్యలు చేపట్టాలన్నారు. క్రమంతప్పకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఎక్కడా వర్షపునీరు నిలిచిపోకుండా చూడాలన్నారు. యాంటీ లార్వాల్ ఆపరేషన్స్ను విస్తృత స్థాయిలో చేపట్టాలని ఆదేశించారు. అవసరం మేరకు మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహించాలని స్పష్టం చేశారు. దోమల నియంత్రణతో పాటు సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రాలు, డిజిటల్ కంటెంట్, వీడియో షార్ట్ క్లిప్పింగ్స్ వంటివాటితో అవగాహన కల్పించాలని ఆదేశించారు. తాగునీటి వాటర్ సోర్స్లతో పాటు ఫిల్టర్ పాయింట్లను నిరంతరం తనిఖీ చేయాలని.. ఎక్కడా కలుషితమయ్యే పరిస్థితి రాకుండా చూడాలన్నారు. తాగునీటికి క్రమంతప్పకుండా పరీక్షలు నిర్వహించి, నివేదికల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. నిలిచిన నీటి నమూనాలకు కూడా బ్యాక్టీరియలాజికల్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్లు చేపట్టాలని.. ఓవర్హెడ్ రిజర్వాయర్ల క్లీనింగ్, క్లోరినైజేషన్ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏఎన్ఎం, ఆశా, సచివాలయ సిబ్బందితో అధికారులు సమన్వయం చేసుకుంటూ సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రెయిన్లలో డీ సిల్టేషన్కు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
వీసీలో డీపీవో పి.లావణ్య కుమారి, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News