గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో వీధి వ్యాపారులు ఎవ్వరికీ ఆసీలు చెల్లించాల్సిన అవసరం లేదని, ఎవరైనా వసూళ్లు చేస్తునట్లు గుర్తిస్తే జిఎంసి కాల్ సెంటర్ 0863-2345103 కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. మంగళవారం నగర కమిషనర్ ఛైర్మన్ గా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో స్ట్రీట్ వెండింగ్ కమిటి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో హోల్ సేల్ పండ్ల మార్కెట్ లో ఆసీలు వసూళ్లకు టెండర్ పొందిన వారు ఇతర ప్రాంతాల్లో వీధి వ్యాపారుల నుండి ఆసీలు పేరుతొ నగదు వసూళ్లు చేస్తున్నారని వెండింగ్ కమిటి ఫిర్యాదు మేరకు నోటీసులు జారీ చేసి, చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్ ని ఆదేశించారు. అలాగే వీధి వ్యాపారులు ఎవ్వరికీ ఆసీలు చెల్లించాల్సిన అవసరం లేదని, ఎవరైనా వసూళ్లు చేస్తే జిఎంసి కాల్ సెంటర్ కి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. రోడ్ల వెంబడి ఏర్పాటు చేస్తున్న కొబ్బరిబొండాలు, తాటిముంజల వీధి వ్యాపారులు కమర్షియల్ చెత్త సేకరణ వాహనాలకే వ్యర్ధాలు ఇవ్వాలని, అలా కాకుండా రోడ్ల పక్కన వేస్తె చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో నగరంలో గ్రీన్, ఎల్లో, రెడ్ జోన్ల ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, తదుపరి రెడ్ జోన్లలో ఎట్టి వ్యాపారాలకు అనుమతి లేదన్నారు. ఇప్పటికే రోడ్ల ముందుకు వచ్చిన వీధి వ్యాపారులు తప్పనిసరిగా రోడ్ మార్జిన్ లోనే ఉండాలని, ట్రాఫిక్ పోలీసులు, జిఎంసి పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. లాలాపేట మెయిన్ రోడ్ లో చెత్త తొలగింపు హోల్ సేల్ పండ్ల వ్యాపారులదేనన్నారు. త్వరలో మరోమారు వీధి వ్యాపారుల సర్వే చేసి, వాస్తవంగా ఉండే వారికే గుర్తింపు కార్డులు అందించడానికి స్ట్రీట్ వెండింగ్ కమిటి కృషి చేయాలన్నారు.
సమావేశంలో అదనపు కమిషనర్ (ఇంచార్జి) సాంబశివరావు, సిటీ ప్లానర్ రాంబాబు, ఎస్ఈ వెంకటేశ్వరరావు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎల్డీఎం మహిపాల్ రెడ్డి, ఉపా సెల్ పిఓ సింహాచలం, వెండింగ్ కమిటి సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News