-ఒక నెల-ఒక గ్రామం-నాలుగు సందర్శనలు కార్యక్రమం కూడా
-ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రణాళికాయుత చొరవ
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు వారి సమస్యలను తెలుసుకొని, వేగవంతంగా పరిష్కరించే లక్ష్యంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
శుక్రవారం మైలవరం నియోజకవర్గం, జి.కొండూరు మండలం, కుంటముక్కల గ్రామంలో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమంతో పాటు ఒక నెల-ఒక గ్రామం-నాలుగు సందర్శనలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి, నిర్దిష్ట గడువులో పరిష్కరించేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూకు సంబంధించి మొత్తం 61 అర్జీలు వచ్చాయి. అదేవిధంగా పంచాయతీరాజ్కు 9, వైద్య ఆరోగ్యశాఖ, వ్యవసాయ శాఖలకు మూడు చొప్పున, మత్స్య శాఖకు రెండు అర్జీలు వచ్చాయి. డీఆర్డీఏ, పౌర సరఫరాలు, కార్మిక, పోలీసు, గ్రామీణ నీటి సరఫరా శాఖలకు ఒక్కో అర్జీ వచ్చాయి. మొత్తం 83 అర్జీలు రాగా.. ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టిసారించి సమస్యలకు సత్వర, నాణ్యమైన పరిష్కారాలను చూపాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను స్థానికంగానే అధికారుల దృష్టికి తీసుకువచ్చే అవకాశం ఇలాంటి కార్యక్రమాల ద్వారా కలుగుతుందని, భూ సమస్యలు, పింఛన్లు, రేషన్, తాగునీరు, విద్యుత్, గృహాలు, ఉపాధి, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి సత్వర పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సమన్వయ అధికారి జి.జ్యోతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News