-వేణుగోపాలస్వామి ఆలయ భూమిపై ఆక్రమణలకు అడ్డుకట్ట వేసిన రెవిన్యూ అధికారులు
-అక్రమ రిజిస్ట్రేషన్లు, ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటాం : తహసీల్దార్ శివయ్య
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయానికి చెందిన భూమిని ఆక్రమణల నుంచి రక్షించేందుకు గన్నవరం ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ఆదేశాల మేరకు చర్యలు చేపట్టినట్లు తహసీల్దార్ శివయ్య తెలిపారు. ఇటీవల నిర్వహించిన ప్రజాదర్బార్లో గ్రామస్థులు దేవాలయానికి చెందిన సర్వే నంబర్ 424/1లోని సుమారు 0.24 సెంట్ల భూమిపై అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించారు. విచారణలో ఆ భూమి గత 60 ఏళ్లుగా స్వామివారి కళ్యాణోత్సవాలు, అన్నదానాలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వినియోగంలో ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో భూమిని ఎండోమెంట్ శాఖ శాశ్వత రిజిస్టర్లో నమోదు చేయడంతో పాటు ప్రభుత్వ నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చాలని ఎండోమెంట్ కమిషనర్కు ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మార్వో శివయ్య తెలిపారు. అలాగే అక్రమ ఆక్రమణలు, రిజిస్ట్రేషన్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు లేఖ రాసినట్లు వెల్లడించారు. దేవాదాయ శాఖకు చెందిన భూముల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ఆక్రమణలు, అక్రమ రిజిస్ట్రేషన్లపై కఠిన చర్యలు కొనసాగుతాయని తహసీల్దార్ శివయ్య స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News