అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL) పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు సంస్థ ఒక సానుకూల నిర్ణయాన్ని ప్రకటించింది. విద్యుత్ సమస్యల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేసేందుకు గానూ సరికొత్తగా వాట్సప్ (WhatsApp) సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. వినియోగదారులు ఇకపై తమ పరిధిలోని విద్యుత్ అంతరాయాలు, లూజ్ వైర్లు, విరిగిపోయిన స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద సమస్యలను నేరుగా 8330911912 అనే ప్రత్యేక వాట్సప్ నంబర్కు పంపవచ్చు. ఈ సేవలు రోజులో 24 గంటలూ అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
సమస్య తీవ్రతను అధికారులు త్వరగా గుర్తించేందుకు వీలుగా వినియోగదారులు సమస్య ఉన్న ప్రదేశాన్ని ఫొటో లేదా వీడియో తీసి, లోకేషన్తో సహా ఈ వాట్సప్ నంబర్కు మెసేజ్ చేయవచ్చని సంస్థ తెలిపింది. ఫిర్యాదు అందిన వెంటనే క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తమై, యుద్ధప్రాతిపదికన సమస్యను పరిష్కరిస్తారని పేర్కొన్నారు. ఇప్పటికే విద్యుత్ సమస్యల కోసం 1912 టోల్ ఫ్రీ నంబర్తో కూడిన కాల్ సెంటర్ సేవలు నడుస్తున్నప్పటికీ, సాంకేతికతను వాడుకుంటూ సమస్యలను మరింత పారదర్శకంగా, వేగంగా పరిష్కరించడమే ఈ వాట్సప్ సేవల ముఖ్య ఉద్దేశమని అధికారులు వివరించారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల పరిధిలోని వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని APCPDCL యాజమాన్యం కోరింది.
Prajavartha Online Telugu News