అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో శ్రీ మహంకాళి అమ్మవారు శాకాంబరీ దేవి అలంకరణలో భక్తులకి దర్శనం ఇచ్చారు. ఆదివారం కంఠంరాజు కొండూరు గ్రామం, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా లో కొలువై ఉన్న ప్రసిద్ధ అధ్యాత్మిక పుణ్యక్షేత్రం శ్రీ మహంకాళి అమ్మవారు ఆషాడ మాస ఉత్సవాల సందర్భంగా శక్తిస్వరూపిణి అయిన అమ్మవారికి శాకాంబరీ దేవి అలంకరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాల సందర్భంగా కూరగాయలతో ఆలయ ప్రాంగణం, ముఖ మండపం, గర్భగుడిని, ఆలయ పరిసర ప్రాంతాలు శోభాయమానంగా తీర్చిదిద్దారు. అధ్యాత్మికతను మెరుగుపరిచేందుకు ఆలయ ఆవరణం అభివృద్ధి, ఆలయ గోపురం ఆధునికీకరణ చేయడంతో పాటు భక్తుల సౌకర్యార్థం తదితర అవసరమైన మౌలిక వసతులు కల్పించామని, వచ్చే ఆదివారం బోనాల ఉత్సవం నిర్వహిస్తున్నామని ఆలయ కార్యనిర్వాహణాధికారి కోగంటి సునీల్ కుమార్ తెలిపారు. వ్యవస్థాపక ధర్మకర్త డి.రంగ ప్రసాద్, సిబ్భంది బి. రాజేష్ తదితరులు పర్యవేక్షించారు. ముఖ్య అర్చకులు సుబ్రమణేశ్వర శర్మ, అర్చకులు దేవమణి కృష్ణ శర్మ భక్తులకు ఆశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శిచుకున్నారు.
Prajavartha Online Telugu News