– ఇండియా స్కిల్స్ పోటీల్లో యువత అధిక సంఖ్యలో పాల్గొనాలి
– 63 నైపుణ్యాల విభాగాల్లో ప్రతిభ చాటుకునే సువర్ణావకాశం
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా యువతలో నైపుణ్యాలను వెలికితీసి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటేందుకు ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ ఒక గొప్ప వేదికగా నిలుస్తోందని.. ఈ పోటీల్లో యువత పెద్దసంఖ్యలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు.
కలెక్టర్ లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, అధికారులతో కలిసి శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ (2026–27) పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో తప్పనిసరిగా పాల్గొని తమ ప్రతిభను జాతీయ స్థాయిలో చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పోటీల్లో మొత్తం 63 విభిన్న నైపుణ్య విభాగాల్లో విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థులు
https://www.skillindiadigital.gov.in/home ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. నైపుణ్యాలే ఉపాధికి, స్వయం ఉపాధికి, ప్రపంచ స్థాయి అవకాశాలకు పునాదిగా నిలుస్తాయని పేర్కొన్న కలెక్టర్, యువత తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఈ పోటీలు అత్యుత్తమ అవకాశమన్నారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు తమ విద్యార్థులకు ఈ సమాచారాన్ని విస్తృతంగా తెలియజేసి, ఎక్కువ సంఖ్యలో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు, డా. కొల్లేటి రమేష్, డా. జె.సుమన్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News