గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పిజిఆర్ఎస్ కు ప్రజల నుండి అందే ఫిర్యాదులను పూర్తి స్తాయిలో పరిష్కరించి, అవి మరలా పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ నగర పాలక సంస్థ విభాగాదిపతులను ఆదేశించారు. సోమవారం జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను నేరుగా స్వీకరించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారం చూపాలని పిజిఆర్ఎస్, ఇతర వేదికల ద్వారా ప్రజల నుండి అందిన అర్జీల పరిష్కార పురోగతిపై విభాగాధిపతులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేవలం కాగితాల మీద లేదా ఆన్లైన్ రికార్డుల్లో అర్జీలను పరిష్కరించినట్లు చూపడం సరికాదని, క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారు సంతృప్తి చెందేలా పనులు జరగాలని ఆదేశించారు. ముఖ్యంగా పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి సరఫరా మరియు వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఫిర్యాదుల పై తక్షణ స్పందన ఉండాలన్నారు. అర్జీల్లో ఏదైనా సమస్య పరిష్కారానికి సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే, ఆ విషయాన్ని దరఖాస్తుదారునికి వివరించి, ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.
పిజిఆర్ఎస్ ద్వారా 52 అర్జీలు అందాయని, వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 12, ఇంజినీరింగ్ విభాగం 18, రెవెన్యూ విభాగం 14, ప్రజారోగ్య విభాగం 4, ఉపా సెల్ విభాగం 2, అకౌంట్స్ విభాగానికి సంబందించి 2 ఫిర్యాదులు అందాయన్నారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ కిషోర్, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, సిటీ ప్లానర్ రాంబాబు, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, ఎస్ఈ సుందర్రామిరెడ్డి, డిసిపి సూరజ్ కుమార్, ఏఓ జిటి నాయుడు, మేనేజర్ బాలాజీ బాషా పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News