-జిల్లా స్థాయి సమీక్షలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యానికి ఎకో సెన్సిటివ్ జోన్ను జిల్లా పరిస్థితులు, ప్రజల జీవనోపాధి, అభివృద్ధి అవసరాలను సమన్వయం చేస్తూ శాస్త్రీయ ప్రాతిపదికన ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం (Kolleru Wildlife Sanctuary) పరిధిలో కృష్ణా జిల్లాలోని గుడివాడ మండలంలోని 12 గ్రామాలు, బాపులపాడు మండలంలోని 5 గ్రామాలకు ఎకో సెన్సిటివ్ జోన్ (ESZ) ప్రకటించే అంశంపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎకో సెన్సిటివ్ జోన్ను త్వరితగతిన ఖరారు చేయకపోతే ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం అభయారణ్యం సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల పరిధి డిఫాల్ట్ ఎకో సెన్సిటివ్ జోన్గా పరిగణించబడే అవకాశం ఉందన్నారు. కాబట్టి సంబంధిత శాఖలు సమగ్ర అధ్యయనంతో త్వరితగతిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎలూరు, భీమవరంలో రూపొందించిన ప్రతిపాదనలను కూడా పరిశీలించి అవసరమైన సూచనలు స్వీకరించాలని తెలిపారు.
ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో అనుమతించదగిన, నియంత్రిత, నిషేధిత కార్యకలాపాలపై సమగ్ర అవగాహనతో శాఖల వారీగా తమ అభిప్రాయాలు, సూచనలు సిద్ధం చేసి తదుపరి సమావేశంలో సమర్పించాలని కలెక్టర్ సూచించారు.
సమావేశంలో కొల్లేరు వన్యప్రాణి అభయారణ్య మేనేజ్మెంట్ డిఎఫ్ఓ డాక్టర్ ఏ త్రిమూర్తులు రెడ్డి, గుడివాడ ఆర్డీవో జి బాలసుబ్రమణ్యం, కృష్ణా డిఎఫ్ఓ సునీత, డిపిఓ ఎం ధనలక్ష్మి, మత్స శాఖాధికారి అయ్యా నాగరాజా, వ్యవసాయ శాఖ జేడి జ్యోతి రమణి, సర్వే ఏడి లక్ష్మణరావు, పశుసంవర్ధక అధికారి శ్రీనివాసరావు, పిసిబి ఈఈ శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి ఈఈ లోకేశ్వరావు, భూగర్భ జల శాఖ ఏడి బిందు శ్రీ, డ్రైనేజీ శాఖ ఈఈ కిరణ్ బాబు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News