-పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాకు సంబంధించి ఏపీ టెట్ (జూన్, 2026) ఆన్లైన్ పరీక్ష తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. బుధవారం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ అర్బన్ పరిధిలోని పీఎస్సీఎంఆర్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కాలేజీలోని పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులు పరీక్ష రాసేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షలు జరిగినన్ని రోజులు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, పొరపాట్లకు తావులేకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. ఆగస్టు 16వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతున్నట్లు తెలిపారు. జిల్లాలో అయిదు పరీక్షా కేంద్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో 2 కేంద్రాలు ఉన్నట్లు పేర్కొన్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు డిపార్టుమెంటు అధికారులతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులను కూడా నియమించినట్లు వివరించారు. పరీక్ష ముగిసిన అనంతరం డీఈవో ఎల్.చంద్రకళ మాట్లాడుతూ తొలిరోజు ఉదయం 833 మంది అభ్యర్థులకుగాను 765 మంది, మధ్యాహ్నం 255 మంది అభ్యర్థులకుగాను 236 మంది హాజరైనట్లు తెలిపారు. అభ్యర్థులకు సహాయసహకారాలు అందించేందుకు, సందేహాల నివృత్తికి డీఈవో కార్యాలయంలో 93980 44628 హెల్ప్లైన్ నంబరు అందుబాటులో ఉన్నట్లు ఆమె తెలిపారు.
Prajavartha Online Telugu News